తెలంగాణలో ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ రాజకీయ నిశ్శబద్ధాన్ని పాటిస్తూ తన రాజకీయ వారసత్వాన్ని అనధికారికంగా కేటీఆర్ కు కట్టపెట్టేసారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పై ఘాటుగా స్పందించడానికి, రేవంత్ కు ధీటైన జవాబు ఇవ్వడానికి కానీ కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ముందుకొస్తున్నారు.
అయితే పదేళ్ల అధికారం చూసిన కేసీఆర్ ఐదేళ్ల ప్రతిపక్షానికి ఎదురీదలేక ఓటమితో వచ్చిన నైరాశ్యానికి బంది అయిపోయారు. దీనితో ఇటు తన పార్టీకి ఓటేసిన ప్రజలకు, తన పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలకు,అలాగే బిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన నాయకులకు మొహం చాటేస్తూ రాజకీయాలకు దూరంగా ఉంటూ ముహుర్తాలు చూసుకుంటున్నారు కేసీఆర్.
అలాగే ఆయన కుమార్తె కవిత కూడా తన తండ్రి బాటలోనే రాజకీయ నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి దాదాపు ఆరు నెలలు తీహార్ లో జైలు జీవితం అనుభవించిన కవిత కడిగిన ముత్యంలా బయటకొస్తా, అన్యాయంగా నన్ను జైలు పాలు చేసిన వారి అంతు చూస్తా అంతు జైల్లో ఉన్నప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చి బైలు మీద బయటకు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా రాజకీయంగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు.
బిఆర్ఎస్ ఓటమితో వచ్చిన నైరాశ్యంతో తండ్రి ఫామ్ హౌస్ కు పరిమితమయితే, అరెస్టు తో వచ్చిన అవమానం కూతురు ను రాజకీయ వేదికలకు దూరం చేసిందా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో బిఆర్ఎస్ తరుపున గొంతు వినిపిస్తున్న వారిలో కేటీఆర్, హరీష్ రావు మాత్రమే బలమైన నాయకులు. వీరిద్దరే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి అంటే అది బిఆర్ఎస్ పార్టీకి ఏమేరకు రాజకీయ మేలును కలిగిస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.




