అది కేసీఆర్ ‘మాటే శాసనంగా’ చలామణి అవుతున్న బిఆర్ఎస్ స్వర్ణయుగం. ఇక దేశంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలకు స్థానం లేదు. రెంటినీ బంగాళాఖాతంలో విసిరేస్తాను. దేశాన్ని నేను కాకపోతే మరెవరూ ఉద్దరించగలరు?కనుక దేశాన్ని ఉద్దరించేందుకు నేను ఢిల్లీ బయలుదేరుతున్నా. రాష్ట్రంలో అందరికీ ఓకేనా?” అని అడుగుతుండేవారు. ఎవరు కాదనగలరు?
ఆ తర్వాత కేసీఆర్ ప్రత్యేక విమానం వేసుకొని దేశమంతా తిరగడం, ఆ తర్వాత 5-600 కార్లు వేసుకొని మహారాష్ట్ర మీదకు దండయాత్రకు వెళ్ళడం, కానీ చివరికి తిరుగేలేదనుకున్న తెలంగాణలోనే ఓడిపోయి మూల కూర్చోవడం అందరూ చూశారు.
“నేను కూడా పులిబిడ్డనే… నా ఒంట్లో కూడా ఆ పులి రక్తమే ప్రవహిస్తోంది. నిజామాబాద్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేసినా ఆయన వెంటాడి వేటాడి ఓడిస్తాను,” అని కల్వకుంట్ల కవిత కూడా శపధాలు చేశారు.
నాలుగు రోజుల క్రితమే మహిళా దినోత్సవం నాడు చట్ట సభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ హైదరాబాద్లో ధర్నా కూడా చేశారు. కానీ లోక్సభ ఎన్నికలలో నిజామాబాద్ నుంచి మళ్ళీ పోటీ చేసేందుకు వెనకాడుతున్నారు.
ఈసారి లోక్సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉండటంతో కేసీఆర్, కేటీఆర్, కవిత ముగ్గురూ పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఎవరూ అటువంటి ఆలోచనలు కూడా చేయడం లేదు. ఎందుకంటే గ్యారేజీలో ఉన్న కారులో నుంచి దూకి బయటకు పారిపోకుండా కాపాడులేక నానా అవస్థలు పడుతున్నారు కనుక.
బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఈరోజు హన్మకొండలో తన నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీలో చేరబోతున్నానని ప్రకటించబోతుంటే, హటాత్తుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి, ఆయనను ఇంచుమించు బలవంతంగా కారులో పట్టుకుపోయారు.
దాంతో ఆయన అనుచరులు తమ నాయకుడిని కేసీఆర్ పట్టపగలే కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నారు.
మోడీ గీడీ జాన్తానై…నేనే దేశానికి దిక్కు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్, చివరికి ఈ దుస్థితికి చేరుకోవడం ఆశ్చర్యమే కదా?




