కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరు మీద వేల కోట్ల విలువైన వందల ఎకరాల భూమి, చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ చేసిన భూదందా, 2004 లో ఒక్క ఎకరం భూమి కూడా లేదంటూ ఎన్నికల అఫడవిట్ లో ప్రకటించిన కేసీఆర్, నేడు అధికారిక రికార్డు ల ప్రకారమే 440 ఎకరాల భూమిని సంపాదించారు అంటూ కాంగ్రెస్ మొదలుపెట్టిన భూ రాజకీయం అధికార – విపక్షాల మధ్య మాటల యుద్దానికి ఆజ్యం పోసింది.
కేసీఆర్ భూ వ్యవహారం పై కాంగ్రెస్ వాదన ఇలా ఉంటే బిఆర్ఎస్ వాదన మరోలా కనిపిస్తుంది. కేసీఆర్ పుట్టిందే వందల ఎకరాల ‘భూస్వామి’ కుటుంబంలో, ఆయన పుట్టింది 2 ఎకరాల ఇంట్లో, ఇప్పుడు ఆయనకు ఉన్నది 67 ఎకరాలు, ఆయనకు భూదోపిడి చెయ్యాల్సిన అవసరం ఏముంది.? అంటూ కేటీఆర్ మీడియా ముందుకొచ్చారు.
వందల ఎకరాల భూస్వామి కుటుంబంలో పుట్టిన కేసీఆర్ కు హైద్రాబాద్ లో అందరం కలిసి ఉండేందు సరైన ఇల్లు కూడా లేదని, అందుకే ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంటుంటే తానూ నార్సింగ్ లో ఉంటున్నా అంటూ కేసీఆర్ తనయుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.
ఒకపక్క వందల ఎకరాల భూ స్వామి కొడుకు అంటూ చెపుతూనే మరో పక్క కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదంటూ చెప్పడం తో కేటీఆర్ వ్యాఖ్యలు రెండు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని, కేసీఆర్ వందల ఎకరాలున్న శ్రీమంతుడే కానీ ఉండడానికి ఇల్లు కూడా లేని నిరుపేదా అంటూ కేటీఆర్ వ్యాఖ్యల పై సోషల్ మీడియాలో కాంగ్రెస్ శ్రేణులు ట్రోలింగ్ చేస్తున్నారు.
అలాగే గతంలో కేసీఆర్ అండ్ ఫ్యామిలీ యొక్క ఆర్థిక స్థితిగతుల పై కేటీఆర్ ఒక ఇంటర్ వ్యూ లో చేసిన వ్యాఖ్యలను సైతం నేడు వైరల్ చేస్తున్నారు కాంగ్రెస్ క్యాడర్.





