కేసీఆర్‌ సెంటిమెంట్… హండ్రడ్ పర్సంట్ ఎఫెక్టివ్‌!

KCR’s political meetings with Mamata Banerjee, Jagan, Stalin, and other regional leaders become a topic of political discussion

కేసీఆర్‌ తెలంగాణ సిఎంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్‌ పార్టీ శ్రేణుల చేత ‘దేశ్ కీ నేత’… “దేశ ప్రజలందరూ కేసీఆర్‌ వైపే చూస్తున్నారు” అంటూ టముకు వేయించుకున్నారు. తన నాయకత్వంలో థర్డ్ ఫ్రంట్ పెట్టి హైదరాబాద్‌ కేంద్రంగా దేశ రాజకీయాలను శాశిస్తానని చెప్పుకున్నారు.

ప్రత్యేక విమానం వేసుకొని దేశంలో బిజేపిని ద్వేషించే పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. కానీ అయన నాయకత్వాన్ని ఎవరూ అంగీకరించకపోవడంతో ప్లాన్-బీలో భాగంగా దేశంలో అనామక పార్టీలు, రాజకీయ నిరుద్యోగులు, రైతు సంఘాల నేతలను వానర సేనలా పోగేసుకొని ఢిల్లీపై దండయాత్ర చేసి ప్రధాని మోడీని గద్దె దించేద్దామనుకున్నారు.

ADVERTISEMENT

యా చేత్తోనే కాంగ్రెస్‌, బిజేపిలను బంగాళాఖాతంలో పడేసి దేశ రాజకీయాలలో “గుణాత్మకమైన మార్పు” తేవాలనుకున్నారు. ప్రధాని కాగానే అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగాన్ని పక్కన పడేసి కొత్త రాజ్యాంగం వ్రాయాలనుకున్నారు.

కానీ కేసీఆర్‌లో వచ్చిన “గుణాత్మకమైన మార్పులు” ఎవరికీ నచ్చకపోవడంతో అందరూ కలిసి ఆయనని ఫామ్‌హౌసుకి షిఫ్ట్ చేసేశారు!

సరే కేసీఆర్‌-బీఆర్ఎస్‌ పార్టీని ప్రజలు తిరస్కరిస్తే తిరస్కరించి ఉండొచ్చు. కానీ అయన దేశంలో కలిసిన ప్రతీ ఒక్కరినీ ఆయా రాష్ట్రాల ప్రజలు తిరస్కరించడం చూస్తే ఇదేదో కొత్త సెంటిమెంటు అనిపిస్తుంది.

కేసీఆర్‌ మొట్ట మొదటగా మమతా బెనర్జీని కలిశారు. దాదాపు ఒకట్టిన్నర దశాబ్దాలుగా ఆమె సిఎంగా చేస్తున్నారు. తాజా ఎన్నికలలో ఆమె పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.

ఆ తర్వాత తొమ్మిదిన్నరేళ్ళ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ని కలిస్తే ఆయన ఫినిష్. కర్ణాటకలో దేవగౌడ, కుమార స్వామిని కలిస్తే వాళ్ళు తుడిచి పెట్టుకు పోయారు.

ఓడిశాలో 24 ఇయర్స్ ఇండస్ట్రీ.. నవీన్ పట్నాయక్‌ని కలిశారు. పాపం అయన కొట్టుకుపోయారు. తమిళనాడు వెళ్ళి స్టాలిన్ని కలిసొస్తే… పాపం ఆయన కూడా! కేరళ సిఎం పినరయి విజయన్‌కి ఈ సెంటిమెంట్ పట్టింపులు లేవు కనుక హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌ని కలిశారు. ఆయనకి పట్టింపులు లేకపోయినా సెంటిమెంట్ బలం చాల ఎక్కువ. కనుక పాపం ఆయన కూడా!

బిహార్‌ సిఎం నితీష్ కుమార్‌ పరిస్థితి కాస్త నయమే. సిఎం పదవి అప్పగించేసి రాజ్యసభకు వెళ్ళిపోయారు. కనీసం మరో 20-25 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉందామనుకున్న జగన్‌తో దోస్తీ చేస్తే పాపం 11కి మారిపోయారు. ఈ జాబితాలో మిస్ అయినవారు ఇంకా చాలా మందే ఉండి ఉండవచ్చు. ఎవరికీ గుర్తుంటే వారు ఆ పేర్లు జోడించి చదువుకోవచ్చు.

కానీ మరో విశేషం ఏమిటంటే, కేసీఆర్‌ ఎవరెవారిపై కత్తులు దూస్తే వారందరూ పదవి, అధికారంలో స్థిరపడుతున్నారు. ఆ జాబితాలో ప్రధాని మోడీ మొదలు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి వంటివారు చాలా మందే ఉన్నారు.

కేసీఆర్‌ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కత్తులు దూస్తునంత కాలం వారిద్దరికీ ఢోకా లేనట్లే. హండ్రడ్ పర్సంట్ ఎఫెక్టివ్‌గా పనిచేసే ఈ కేసీఆర్‌ సెంటిమెంట్‌ని అందరూ గుర్తించాల్సిందే… గౌరవించాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories