బిఆర్ఎస్ ఓటమి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఫామ్ హౌస్ కి దగ్గర గా ఉంటున్న కేసీఆర్ ఈ నెల 20 వ తేదీన జగిత్యాలలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు హాజరవుతారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
దీనితో ఇన్నాళ్ల కేసీఆర్ అజ్ఞాతానికి జగిత్యాల బహిరంగ సభ ముగింపు పలకనుందా అంటూ బిఆర్ఎస్ శ్రేణులు కూడా అధినేత ఆగమనం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అలాగే జగిత్యాల ను తన రాజకీయ కంచుకోటగా చేసుకుని కాంగ్రెస్ పార్టీలో హావ కొనసాగించిన సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా తాజాగా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బిఆర్ఎస్ కారెక్కారు.
ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ జగిత్యాల బహిరంగ సభ తెలంగాణలో రానున్న రాజకీయ మార్పుకి సంకేతం కానుందా అన్న ఆసక్తి తెలంగాణ రాజకీయాలలో కనిపిస్తుంది. రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి అంటూ రేవంత్ సర్కార్ మీద రాజకీయ యుద్ధం ప్రకటించిన జీవన్ రెడ్డి జగిత్యాల సభలో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారు.
అలాగే ఈ నెల 25 న కేసీఆర్ కుమార్తె కవిత కూడా తన కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటిస్తానని, ఆ పేరులో తెలంగాణ ఉంటుందని, తెరాస బిఆర్ఎస్ గా మారిన క్రమంలో ఇప్పుడు తెరాస పేరు ఖాళీగా ఉందంటూ తన పార్టీ పేరు తెరాస గా ఉండే అవకాశం కూడా ఉండొచ్చని సంకేతాలు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆగమనం అత్యంత కీలకంగా మారింది. జీవన్ రెడ్డి చేరిక, కవిత చీలిక, కాళేశ్వరం పరిణామాలు ఇలా ఎన్నో అంశాలు కేసీఆర్ స్పందన కోసం ఎదురుచూస్తున్నాయి. మరి కేసీఆర్ జగిత్యాల సభలో వీటిలో ఏ అంశాలకు కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తారు.? ఏ అంశాలను పక్కన పెడతారు.? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
అలాగే ఇక ఇక్కడితో కేసీఆర్ తన ఫామ్ హౌస్ రాజకీయానికి ముగింపు పలికి యాక్టీవ్ రాజకీయాలలోకి వస్తారా.? లేదా వేదిక ను అలంకరించిన అతిధి పాత్రలో మెరిసి మరోమారు మాయమవుతారా.? అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.




