సినిమాలలో కానీ రాజకీయాలలో కానీ వాయిదా అనేది సానుకూల ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో చిత్ర యూనిట్ విఫలం అయితే దాని పర్యవసానాలు చాల బలంగా ఉంటాయి అనేదానికి ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ఉదాహరణలుగా నిలిచాయి.
అలాగే ఇప్పటికి నిలుస్తున్నాయి కూడా. అందుకు స్టార్ హీరోల సినిమాలు కూడా ఏమాత్రం అతీతం కాదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం నిరూపించి చూపించింది. వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ కొన్నేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ధియేటర్ లోకి వచ్చిన ఈ చిత్రం కనీసం పవన్ అభిమానులను కూడా మెప్పించలేకపోయింది.
అలాగే ఇదే వాయిదాల పర్వంతో మెగా పవర్ స్టార్ రాంచరణ్ గేమ్ ఛేంజర్ కూడా అటు నిర్మాతలకు, ఇటు హీరోకి ప్రతికూల ఫలితాన్నే అందించింది. అయితే ఈ వాయిదాలు ఒక్క సినీ ఇండస్ట్రీనే కాదు రాజకీయాలను కూడా ప్రభావితం చెయ్యగలవు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా మూల్యం చెల్లించాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అభివృద్ధిని అనుకున్న సమయానికి ప్రజల కళ్ళ ముందుంచలేక నాటి టీడీపీ ఓటమిపాలయితే, ఇక తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పోలవరం పూర్తి పైన వాయిదాల తీర్మానాలు చేస్తూ ఓటమిని మూటకట్టుకుంది. ఈ వాయిదాల నష్టానికి ఈ ఇరు పార్టీలు ఐదేళ్ల ప్రతిపక్షం అనే భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది.
ఇక ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ ఓటమి తరువాత పార్టీ క్యాడర్ లో ఏర్పడిన నిస్సహాయతను తొలగించేందుకు పార్టీ లీడర్లలో జోష్ ని నింపేందుకు పార్టీ అధినేత కల్వకుంట చంద్ర శేఖర్ రావు ప్రజాక్షేత్రంలోకి రానున్నారు అంటూ బిఆర్ఎస్ ప్రకటించి ఏడాదయ్యింది.
అయినా ఇప్పటికి కేసీఆర్ ఫామ్ హౌస్ గడప దాటి బయటకు రాలేదు. ఇక కేసీఆర్ రాక ఎప్పుడు.? అసలు కేసీఆర్ బయటకొస్తారా.? అధికార పార్టీకి ధీటైన జవాబిస్తారు.? పార్టీని ముందుండి నడిపిస్తారా.? అంటూ సొంత పార్టీ శ్రేణుల నుంచే కేటీఆర్ కి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే కేసీఆర్ రాకకు ఇంకాస్త సమయం ఉందని, అప్పటి వరకు అటు ప్రత్యర్థి పార్టీ నేతలతో పాటుగా సొంత పార్టీ క్యాడర్ కూడా ఓపిక వహించాలంటూ కేసీఆర్ రాకను మరోసారి వాయిదా వేశారు కేటీఆర్. దీనితో ఇప్పటికే బిఆర్ఎస్ కేసీఆర్ లేని లోటుతో భారీ మూల్యం చెల్లించిందని,
ఇకనైనా ఈ వాయిదాల తీర్మానాలను పక్కన పెట్టి కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రావాలని, అధికార పార్టీతో పోరాడాలని లేకుంటే ఈ వాయిదాలతో బిఆర్ఎస్ మరింత రాజకీయ నష్టాన్ని భరించాల్సి ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇప్పటికే కాంగ్రెస్ అధికారం, కుమార్తె కవిత వేర్పాటు వాదం, హరీష్ పై కట్ఠప్ప, కోవర్ట్ ఆరోపణలు, కేటీఆర్ నాయకత్వం మీద నిందలు వంటివి బిఆర్ఎస్ ని రాజకీయంగా మరింతగా కుంగదీస్తున్నాయి. ఇక కేసీఆర్ రాక కూడా మరోసారి వాయిదా అంటూ ప్రకటిస్తే బిఆర్ఎస్ చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా బాధపడాల్సిందే అనుకుంటున్నారు గులాబి శ్రేయోభిలాషులు.






