సంక్రాంతి వెళ్లి శ్రావణం వచ్చింది..అయినా.?

KCR Brs Party

తెలంగాణలో హ్యాట్రిక్ విజయం కోసం ఎదురుచూసిన కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ఉహించని అపజయాన్ని రిటర్న్ గిఫ్ట్ గా అందించారు. దీనితో అసెంబ్లీ మొదలుకుని తెలంగాణ భవన్ వరకు కేసీఆర్ జాడే లేకుండా పోయింది. అటు పార్టీ కార్యక్రమాల నుంచి ఇటు ప్రత్యర్థి పార్టీల విమర్శల వరకు ఎక్కడ కేసీఆర్ గొంతు కానరావడం లేదు.

మేడిగడ్డ కుంగినా, కాళేశ్వరం కేసులు పెట్టినా, కూతురు కవిత అరెస్టయిన, కొడుకు కేటీఆర్ కేసులను ఎదుర్కొంటున్నా , బిఆర్ఎస్ విలీనం అంటూ గులాబీ కారు ఉనికి కోసం అల్లాడుతున్నా, జాగృతి అంటూ కవిత సొంత కుంపటి ఏర్పాటుకు సిద్దమైనా కేసీఆర్ మాత్రం తన మౌనాన్ని వీడడం లేదు, ప్రజా క్షేత్రంలోకి అడుగు పెట్టడం లేదు.

ADVERTISEMENT

ఈ ఏడాది సంక్రాంతి తరువాత కేసీఆర్ ప్రజా క్షేత్రంలోకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాడుతారు, ప్రజలకు అండగా ఉంటారు, పార్టీ క్యాడర్ కు అందుబాటులోకి వస్తారు, నాయకులకు దిశా నిర్దేశం చేస్తారు అంటూ బిఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు వంటి వారు మీడియా ముందు ప్రగల్భాలు పలికారు.

అయితే వారు చెప్పిన సంక్రాతి వెళ్లి శ్రావణం కూడా వచ్చేసింది, అయినా కేసీఆర్ ఎక్కడ కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఒకపక్క వయస్సు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ మరోపక్క పార్టీ ఆధిపత్యం కోసం కొడుకు, కూతురు మధ్య ఇంటి పోరు ఎదుర్కొంటు కేసీఆర్ ప్రత్యర్థి పార్టీ నేతలు చేసే విమర్శలను పెద్దగా పట్టించుకోవడం లేదా.? అన్న ప్రశ్న తలెత్తుతుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది, రేవంత్ అనాలోచిత చర్యలతో హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ కుంచించుకు పోతుంది, తెలంగాణ ప్రజల హక్కులు ఏపీకి తరలిపోతున్నాయి అంటూ కేటీఆర్ ఒకపక్క రెచ్చిపోతూ మరోపక్క రెచ్చకొడుతూ బిఆర్ఎస్ కారును ముందుకు తీసుకెళ్తున్నారు.

బిఆర్ఎస్, బీజేపీ లో విలీనం కానుంది, ఆ దిశగా గతంలో ఢిల్లీ కేంద్రంగా చర్చలు జరిగాయి, అందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్దన్న పాత్ర పోషించారు అంటూ ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు పదేపదే బిఆర్ఎస్ ఉనికి మీద విమర్శలు చేస్తున్నా కేసీఆర్ మాత్రం వారి విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.

ఒకరకంగా పార్టీ ఓటమి నుంచి నేటి వరకు బిఆర్ఎస్ అధినేత కేటీఆరే అన్న చందంగా పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి. కేసీఆర్ ను ఫోటోకి పరిమితం చేసి కేటీఆర్ మెయిన్ ఫ్రేమ్ లోకి దూకుతున్నారు. ఈ అంశం పట్లే కేటీఆర్, కవిత మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి అనేది బిఆర్ఎస్ ఇన్ సైడ్ టాక్.

దీనితో అటు కవిత జాగృతి ని తట్టిలేపుతూ బిఆర్ఎస్ పై పరోక్ష విమర్శలకు దిగుతున్నారు. ఇటు బీజేపీ, పార్టీ విలీనం అంటూ రాజకీయం నడిపిస్తుంది. మరోపక్క దమ్ముంటే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీ వచ్చి పోరాడాలి అంటూ కాంగ్రెస్ రెచ్చకొడుతోంది. అధినేత ఎక్కడ అంటూ గులాబీ సైన్యం ఎదురుచూస్తూనే ఉంది. అయినా కేసీఆర్ మాత్రం తన అజ్ఞాతవాసాన్ని వీడి బయటకురావడం లేదు.

గతంలో జగన్ అమరావతిని కాదని విశాఖను రాజధానిగా ప్రకటించి ఈ దసరాకు విశాఖ రాజధాని కానుంది, లేదు లేదు వచ్చే సంక్రాంతికి, కాదు కాదు ఈ ఉగాది కి అంటూ పండుగల పేర్లతో కాలక్షేపం చేస్తూ విశాఖ ప్రజలను మోసం చేస్తూ ఏపీతో మూడుముక్కలాట ఆడారు.

ఇప్పుడు కేసీఆర్ కూడా ఈ సంక్రాంతి, ఆ శ్రావణం, దసరా, ఉగాది అంటూ బిఆర్ఎస్ క్యాడర్ ని ఏమార్చుతూ, తెలంగాణ ప్రజలతో దాగుడుమూతలు ఆడుతూ రానున్న మూడునారెళ్ళ కాలాన్ని అజ్ఞాతంతోలోనే గడపనున్నారా.? లేక ఫామ్ హౌస్ గడప దాటనున్నారా.? అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories