తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ ఎంత పెద్ద సమస్య ఎదురైనా చాలా నిబ్బరంగా ఉంటారు. కానీ తొలిసారిగా ఇవాళ్ళ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఈరోజు తెల్లవారు జామున హైదరాబాద్ ఏఐజీ హాస్పిటలో బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మృతి చెందారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చిన కేసీఆర్, కన్నీళ్ళు పెట్టుకున్నారు.
గోపీనాధ్ మొదట టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరి మళ్ళీ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయాలకు అతీతంగా గోపీనాధ్ అందరితో చాలా స్నేహంగా, వివాదాలకు దూరంగా ఉండేవారు. కనుక తెలంగాణలో అన్ని పార్టీల నేతలు ఆయన నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. ఆయనతో టీడీపీకి ఉన్న అనుబందం వలన మంత్రి నారా లోకేష్ కూడా వెళ్ళి నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తోంది.
కేసీఆర్ విషయానికి వస్తే, ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పుడు, మద్యం కుంభకోణంలో కూతురు కల్వకుంట్ల కవిత జైల్లో ఉన్నప్పుడు కూడా కంట తడిపెట్టలేదు. కానీ మాగంటి గోపీనాధ్ భౌతిక కాయాన్ని చూసి కంట తడిపెట్టారు. “తమ పార్టీ ఓ ముఖ్య నాయకుడిని కోల్పోయిందని” బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన సతీమణి హాస్పిటలలో గోపీనాధ్ కుటుంబ సభ్యులకు అండగా నిలబడి ధైర్యం చెప్పారు.




