కేసీఆర్‌ ఎవరి చేతిలో ఓడినా అవమానమే!

Eatala Rajendar KCR Revanth Reddy

తెలంగాణ సిఎం కేసీఆర్‌ పరిచయం అక్కరలేని నాయకుడు. ఎన్నికలలో ఆయన వ్యూహాలకు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలే ఎదురు నిలవలేకపోతున్నాయి. కానీ ఈసారి తెలంగాణలో వాటి నుంచే గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా ఒకప్పుడు ఆయనతో కలిసి ఉద్యమాలు చేసి తన ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా చేసిన ఈటల రాజేందర్‌ గజ్వేల్ నుంచి పోటీకి సిద్దమవడం కేసీఆర్‌కు పెద్ద షాక్ అనే చెప్పాలి.

ADVERTISEMENT

ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో ఓడించి ఆయనకు రాజకీయంగా సమాధి కట్టాలని కేసీఆర్‌ విశ్వప్రయత్నం చేశారు. దాదాపు 5-6 నెలల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ అక్కడ మోహరించి ప్రచారం చేసినప్పటికీ ఈటల రాజేందరే చివరికి విజయం సాధించారు. దాంతో ఆయన చేతిలో బిఆర్ఎస్ అభ్యర్ధి కాదు కేసీఆరే ఓడిపోయిన్నట్లయింది.

ఇప్పుడు ఆయనే బీజేపీ అభ్యర్ధిగా గజ్వేల్‌లో పోటీకి సిద్దపడటంతో, కేసీఆర్‌ ముందు జాగ్రత్త చర్యగా కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు.

అయితే అక్కడా కేసీఆర్‌కు మరో బలమైన శత్రువు సిద్దమయ్యాడు. ఆయనే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. ఓటుకి నోటు కేసులో ఇరికించి జైలుకి పంపించినప్పుడే, “ఎప్పటికైనా కేసీఆర్‌ని గద్దె దించి జైలుకి పంపకపోతే నా పేరు రేవంత్‌ రెడ్డే కాదు,” అని శపధం చేశారు. అంత మాత్రన్న ఓడించేయగలరా?అని అనుకోవచ్చు. కానీ రేవంత్‌ రెడ్డి గురించి తెలుసుకొంటే ఓడించగలరని ఒప్పుకోకతప్పదు.

తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండు ఎన్నికలలో ఓడిపోయింది. ఆ తర్వాత ఫిరాయింపులతో పూర్తిగా బలహీనపడింది. అలాంటి పరిస్థితులలో పార్టీని మళ్ళీ లేపి నిలబెట్టడం అసాధ్యమే. కానీ రేవంత్‌ రెడ్డి అది చేసి చూపారు.

ముఖ్యంగా పార్టీలో సీనియర్లు తన నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, పదవుల కోసం కుమ్ములాడుకొంటూ పార్టీ పరువు తీస్తున్నప్పుడు పార్టీని నడిపించడం చాలా చాలా కష్టం. కానీ రేవంత్‌ రెడ్డి అదీ సాధ్యమేనని నిరూపించి చూపారు.

రేవంత్‌ రెడ్డి ఓ పక్క పార్టీలో సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూనే మరోపక్క ధైర్యంగా కేసీఆర్‌ని ఢీకొంటూ ముందుకు సాగారు. అంతేకాదు… కేసీఆర్‌ని ఓడించి కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగలదని పార్టీ అధిష్టానానికి, నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు కూడా నమ్మకం కలిగించారు. ఇవేవీ సామాన్యమైన విషయాలు కావు. కనుక రేవంత్‌ రెడ్డిని తక్కువ అంచనా వేయలేము.

ఇక మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఈటల రాజేందర్‌, రేవంత్‌ రెడ్డి ఇద్దరూ కూడా కేసీఆర్‌ చేతిలో తీవ్ర అవమానాలకు గురైనవారే. ఇద్దరూ కేసీఆర్‌పై ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నారు. కేసీఆర్‌ ఓడించాలని ఇద్దరూ చాల పట్టుదలగా ఉన్నారు. కనుక మొట్టమొదటిసారిగా ఈసారి కేసీఆర్‌కు రెండు చోట్ల ‘సమఉజ్జీలతో’ పోటీ పడాల్సి ఉంటుంది.

ఒకవేళ కేసీఆర్‌ వారిద్దరినీ ఇద్దరినీ ఓడిస్తే ఇక ఆయనకు తిరుగు ఉండదు. కానీ ఇద్దరిలో ఎవరి చేతిలో ఓడిపోయినా అది ఆయనకు, బిఆర్ఎస్ పార్టీకి కూడా తీరని అవమానమే అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories