కేసీఆర్‌ వైఖరి తెలంగాణకు శాపం.. జగన్‌ వైఖరి ఏపీకి వరం!

KCR and Jagan Mohan Reddy political comparison between Telangana and Andhra Pradesh

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణ ధనిక రాష్ట్రంగా అవతరించగా, చేతిలో చిల్లిగవ్వ లేని వ్యవసాయ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మిగిలింది. ఆ ఫ్లాష్ బ్యాక్ కథ అందరికీ తెలుసు. కనుక మళ్ళీ చెప్పుకోనవసరం లేదు.

ఏపీ ఇక ఎన్నటికీ కోలుకోలేదు.. తెలంగాణకు ఇక తిరుగులేదు.. అని అందరూ భావిస్తున్నవేళ రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారడంతో ఈ పరిస్థితులు కూడా అనూహ్యంగా మారిపోయాయి.

ADVERTISEMENT

ధనిక రాష్ట్రం, హైదరాబాద్‌ కూడిన అభివృద్ధి చెందిన రాష్ట్రం అనుకున్న తెలంగాణలో కాంగ్రెస్‌, బిజేపి, బీఆర్ఎస్‌ పార్టీల మద్య మూడు ముక్కల ఆట మొదలైంది. అవి సరిపోవన్నట్లు ఇప్పుడు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో టీఆర్ఎస్‌ పార్టీ కూడా వచ్చి చేరింది.

ఇప్పుడు నాలుగు పార్టీల మద్య రాజకీయ ఆధిపత్యపోరు జోరుగా సాగుతోంది. ఈ నాలుగూ కాక మరో అర డజను చిన్నా చితకా పార్టీలు ఉండనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్ళలోనే ఇన్ని రాజకీయ పార్టీలు ఎందుకు పుట్టుకొచ్చాయి?అంటే రాజకీయ శూన్యత, ప్రజలలో అసంతృప్తి ఉన్నందునే అని చెప్పుకుంటున్నాయి.

ఇప్పుడు తెలంగాణలో కేవలం రాజకీయాలు మాత్రమే జరుగుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి మాత్రమే జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి, పోలవరం, క్వాంటం వ్యాలీ, గూగుల్, ఆర్స్‌లర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌, భోగాపురం ఎయిర్ పోర్ట్, మూలపేట, రామయపట్నం పోర్టు వంటివి అనేకం కనిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం పట్ల కేసీఆర్‌కి ఎంత నిబద్దత ఉన్నప్పటికీ అయన రాజకీయ వైఖరే ఆ రాష్ట్రానికి, పార్టీకి కూడా శాపంగా మారింది. వచ్చే ఎన్నికలలో సొంత కూతురు కల్వకుంట్ల కవితతోనే కేసీఆర్‌, టీఆర్ఎస్‌ పార్టీతోనే బీఆర్ఎస్‌ పార్టీ పోటీ పడాల్సి వస్తుండటమే ఇందుకు నిదర్శనం కాదా?తెలంగాణలో అన్ని పార్టీలు పోటీ పడితే చివరికి ఏమవుతుందో ఎవరికీ తెలీదు.

అన్ని విధాల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జగన్‌ వైఖరి వలన కాస్త అదృష్టం దక్కిందనే చెప్పాలి. ఆయన మరెవరితో పొత్తు పెట్టుకోకపోవడం లేదా ఆయనతో మరెవరూ పొత్తుకు అంగీకరించకపోవడం వలన రాష్ట్రంలో ఒంటరిగా వైసీపీ, మిగిలిన మూడు పార్టీలన్నీ ఐకమత్యంగా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి. కనుక తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఓట్లు చీలే అవకాశం చాలా తక్కువే.

ముఖ్యంగా జగన్‌ నేటికీ అమరావతిని వ్యతిరేకించడం, పరిశ్రమలు, ఐటి కంపెనీలను భయపెట్టాలని ప్రయత్నించడం వలన వచ్చే ఎన్నికలలో ఏ పార్టీని ఎన్నుకోవాలనే విషయంలో ప్రజలకు మరింత స్పష్టత వస్తోంది. కనుక జగన్‌ విపరీత ధోరణి కూడా ఓ విధంగా ఏపీకి మేలే చేస్తోందని చెప్పవచ్చు.

రాజకీయంగా, అభివృద్ధిపరంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సుస్థిరత నెలకుంటే, తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు, పార్టీల మద్య రాజకీయ ఆధిపత్యపోరు వలన అనిశ్చిత వాతావరణం ఏర్పడింది. ఇంత తక్కువ సమయంలో పరిస్థితులు ఇంతగా మారుతాయని బహుశః ఎవరూ ఊహించి ఉండరు… కదా?

ADVERTISEMENT
Latest Stories