రేవంత్ రెడ్డి మరికొందరు టీడీపీ నాయకులు చేరడంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఊపు వచ్చింది. దీనితో మరిన్ని చేరికలు ఉన్నాయి అంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి, ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు.
తెరాస లో ఉన్న కొండా సురేఖ దంపతులు, బీజేపీ లో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి ఆయా పార్టీలలో ఇమడలేకపోతున్నారు. వారిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. పైకి ఈ వార్తలను వారు ఖండించిన వారు తమ ముందు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
మరోపక్క భాజపా సీనియర్ నాయకుడు యెన్నం శ్రీనివాస రెడ్డి కూడా గత కొంత కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇటువంటి వలసలతో తెలంగాణ కాంగ్రెస్ మరింత శక్తిమంతం అవుతుందని విశ్లేషకుల అభిప్రాయం.
కాంగ్రెస్ లో జరుగుతున్న అన్ని పరిణామాలను కేసిఆర్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీటి అన్నిటికి కొడంగల్ ఉపఎన్నికలలోనే సమాధానం చెప్పాలని ఆయన ఉద్దేశం. ఈసారి కొట్టే దెబ్బకి కాంగ్రెస్ ఆశలను మొగ్గలోనే తుంచేసి ఆ పార్టీ ఊపిరి తీసేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.


