జగన్‌ టికెట్స్ ఇస్తానంటే గోడ దూకి పారిపోతున్నారేమిటి?

koneti-adimulam_nara-lokesh

ఈసారి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయబోమని వైసీపిలో పలువురు సీనియర్లు ముందే చెప్పేసి, ఆ సీట్లను తమ పుత్రరత్నాలకు కేటాయింపజేసుకొంటున్నారు. రాజకీయ నాయకులు తమ వంశోద్ధారకులను రాజకీయ వారసులుగా తీసుకురావాలని అనుకోవడం చాలా సహజమే.

అయితే ఈసారి 175 సీట్లు మనమే గెలుస్తామని జగన్‌ నమ్మకంగా చెపుతుంటే, సీనియర్లు ఎవరూ వెనక్కు తగ్గాల్సిన అవసరమే లేదు. ఎలాగూ జగన్‌ మరో 25-30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పుకొంటున్నారు కనుక వచ్చే ఎన్నికలలో తమ పుత్రరత్నాలను బరిలో దించుకోవచ్చు కదా?

ADVERTISEMENT

కానీ వైసీపికి మరో ఛాన్స్ లభించకపోవచ్చని ముందే పసిగట్టిన కొందరు సీనియర్లు, ఈ ఎన్నికలలో తమ పుత్ర రత్నాలను నిలబెట్టి ఎలాగోలా గెలిపించేసుకుంటే, ఆ తర్వాత వారికీ దారి ఏర్పడుతుందని భావిస్తున్నట్లున్నారు. సీనియర్ల పరిస్థితి ఇలా ఉంటే, సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయమని జగన్‌ అవకాశం ఇస్తుంటే, మన పార్టీకి అంత సీన్ లేదంటూ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలలో చేరిపోతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

నరసారావుపేట వైసీపి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయమని జగన్‌ కోరితే, ‘కుదరదని’ జగన్‌ మొహం మీదనే చెప్పేసి పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేసేశారు.

కర్నూలు ఎంపీ టికెట్‌ గుమ్మనూరి జయరాంకు కేటాయిస్తే, అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగా తిరుగుతున్నారు. ఆయన పోటీ చేయలేక తప్పుకు తిరుగుతున్నారని భావించిన జగన్‌ వేరే వారిని అక్కడ సెట్ చేస్తున్నారు.

తాజాగా తిరుపతి జిల్లా సత్యవేడు వైసీపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంని ఈసారి తిరుపతి నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని జగన్‌ ఆదేశించి, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించారు కూడా. సత్యవేడు టికెట్‌ మద్దిల గురుమూర్తికి ఇచ్చారు.

దీంతో వైసీపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నిన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని కలిశారు. ఫిబ్రవరి 4వ తేదీన టిడిపిలో చేరబోతున్నారు!

రెండేళ్ళకే జగన్‌ పక్కన పెట్టేసిన మాజీ మంత్రి, నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్, ఈసారి నెల్లూరు నుంచి పోటీ చేసేందుకు భయపడుతున్నారు. కారణం నెల్లూరు నుంచి టిడిపి అభ్యర్ధిగా మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తుండటమే! అందుకే తాను నర్సారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తానని జగన్‌ను కోరుతున్నారు.

గత ఎన్నికలలో ఉమ్మడి నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో వైసీపి ఇంచుమించి క్లీన్ స్వీప్ చేసింది. కనుక ఈ 5 ఏళ్లలో ఆ మూడు ఉమ్మడి జిల్లాలలో వైసీపి చాలా బలపడింది. ఈసారి 175 సీట్లు మనమే గెలుస్తామని జగన్‌ నమ్మకంగా చెపుతున్నారు కూడా.

అయినా ఎన్నికలలో పోటీ చేయడానికి వైసీపి నేతలు వెనకాడుతున్నారంటే అర్దం ఏమిటి?పోటీ చేయమని టికెట్స్ ఇస్తుంటే పార్టీకి రాజీనామాలు చేసి గోడ దూకి పారిపోతున్నారంటే అర్దం ఏమిటి?

ADVERTISEMENT
Latest Stories