ఏపీ, తెలంగాణళ మద్య కృష్ణా జలాలపై మొదలైన రగడ అందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మద్య ఆధిపత్యపోరు సాగుతోంది. దానిలో పైచేయి సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఈ సమస్యతో రాజకీయాలు మొదలుపెట్టింది.
తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మూసీ నది ప్రక్షాళనపై కూడా బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తూనే ఉంది. కనుక నీళ్ళ పేరుతొ ఆ పార్టీ ఏవిధంగా రాజకీయాలు చేస్తోందో, ప్రజలకు వివరించి దానికి చెక్ పెట్టాలి. కానీ అయన కూడా దాని ఉచ్చులో చిక్కుకొని ఏపీ ప్రభుత్వంపై కత్తులు దూస్తున్నారు. రాయలసీమతో సహా కృష్ణానదిపై నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులు నిలిపివేయాల్సిందే అంటున్నారు.
ఇదే సమయంలో తమ రాష్ట్రంలో నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులకు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏపీలో ఏ ప్రాజెక్ట్ మొదలుపెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, ట్రిబ్యునల్కి పిర్యాదులు చేసి అడ్డుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. పైగా మేమే అడ్డుకున్నామని గొప్పగా చెప్పుకుంటోంది కూడా.
ఓ పక్క ఏపీలో ప్రాజెక్టులు అడుగడుగునా అడ్డుపడుతూ, తమ రాష్ట్రంలో ప్రాజెక్టులకు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సహకరించాలని సిఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారు.
ఈరోజు రంగారెడ్డి జిల్లాలోసుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, “ఈ వేదిక నుంచి నేను ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. సమైక్య రాష్ట్రంలో ప్రారంభించిన మా ప్రాజెక్టులను అడ్డుకోవద్దు. మీరు అభ్యంతరాలు వ్యక్తం చేయడం వలన కేంద్రం నుంచి మాకు రావాల్సిన నిధులు రావడం లేదు.
పర్యావరణ అనుమతులు రావడం లేదు. అందువల్ల మా ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడుతోంది. అది నానాటికీ పెరిగిపోతోంది. మాకు మీ ప్రభుత్వంతో ఎటువంటి గొడవలు వద్దు. కేవలం మా నీళ్ళు మాకు దక్కితే చాలనుకుంటాను.
నీళ్ళ పేరుతో రాజకీయాలు చేయాలనుకోవడం లేదు. కనుక మా ప్రాజెక్టులకు మీరు సహకరిస్తే, మీ ప్రాజెక్టుల విషయంలో ఏవైనా సమస్యలుంటే మేమూ మీకు సహకరిస్తాము,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఎగువనున్న తెలంగాణ రాష్ట్రంలో ఎడా పెడా సాగునీటి ప్రాజెక్టులు కట్టుకుంటూ, కృష్ణాలో ఉన్న నీళ్ళను తరలించుకుపోతే దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. కనుక ఏపీ పాలకులు ఆందోళన చెందడం సహజం. కానీ దిగువన ఉన్న ఏపీలో ప్రాజెక్టులు నిర్మించుకుంటుంటే, తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు రాజకీయ మైలేజ్ కోసం అడ్డుపడుతున్నాయి.
ఇష్టారాజ్యంగా నీళ్ళు వాడేసుకుంటూ తిరిగి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని నిందిస్తున్నారు. తమ ప్రాజెక్టులకు సహకరించాల్సిందే. లేకుంటే జూరాల నుంచి ఒక్క చుక్క నీరు కిందకు రాకుండా తరలించుకుపోతామని బెదిరిస్తున్నారు కూడా.
గొడవలు వద్దు కూర్చొని మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకుందామని చెపుతూనే ఇలా బెదిరిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం అవ్వాలని నిజంగా కోరుకుంటే ఈవిధంగా వ్యవహరించకూడదు. కానీ ఈ నీళ్ళ సమస్య సజీవంగా ఉంటేనే తెలంగాణ సెంటిమెంట్ పండించుకొని రాజకీయంగా లబ్ది పొందవచ్చని భావిస్తున్నారు.
ఇలాంటి ఆలోచనలున్నప్పుడు ఎన్నిసార్లు చర్చించుకున్నా ప్రయోజనం ఉండదు. కనుక ఏపీ ప్రభుత్వం కూడా తగిన రీతిలో చర్యలు చేపట్టక తప్పదు.






