ఐటి రంగం అంటే మొదట గుర్తుకు వచ్చేది చంద్రబాబు నాయుడు ఆ తర్వాత తెలుగు ఐటి నిపుణులు. ఒకప్పుడు దేశంలో బెంగళూరు ఐటి రాజధానిగా ఉండేది కానీ ఇప్పుడు ఆ హోదా హైదరాబాద్ దొరకపుచ్చుకొంది. అయితే అదేమీ రాత్రికి రాత్రి దక్కింది కాదు. దాని కోసం తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్, ఆయన టీమ్ ఎంతో ప్లాన్ చేసి, ఎంతో శ్రమించి, హైదరాబాద్లో ఐటి రంగం అభివృద్ధికి ఉన్న అవరోధాలను గుర్తించి అన్నిటినీ ప్రక్షాళన చేసుకొంటూ ఓ చక్కటి ఐటి పాలసీని ప్రకటించారు. ఆ తర్వాత ఆనాడు చంద్రబాబు నాయుడు కాళ్ళు అరిగిపోయేలా తిరిగిన్నట్లు దేశవిదేశాలలో తిరిగి అందరినీ మెప్పిని ఒప్పించితే హైదరాబాద్ నగరానికి పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థలు, ఐటి కంపెనీలు రావడం మొదలుపెట్టాయి.
అదే సమయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రివర్స్ గేరులో పాలన సాగుతుండటం కూడా తెలంగాణకు చాలా కలిసి వచ్చింది. దాంతో అమరావతికి రావలసినవి, ఏపీకి వచ్చినవి కూడా తట్టాబుట్టా సర్ధుకొని హైదరాబాద్కు క్యూ కట్టాయి. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి ఎంతైనా ఋణపడి ఉండాలి.
అయితే తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఒక్కటే రాజధానిగా ఉన్నప్పటికీ, సిఎం కేసీఆర్ అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకుపోతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికే పరిమితమైన ఐటి, ఫార్మా, ఇతర పరిశ్రమలను అన్ని జిల్లాలకు సమానంగా వ్యాపింపజేసుకొంటున్నారు. అందుకే ఇప్పుడు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఇప్పుడు తాజాగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఐటి కారిడార్ ఏర్పాటైంది. మంత్రి కేటీఆర్ శనివారమే మహబూబ్నగర్లో ఐటి కారిడార్కు ప్రారంభోత్సవం చేశారు. దీని మొదటి దశలో 8 ఐటి కంపెనీలు రానున్నాయి. వీటి ద్వారా సుమారు 2-3000 మంది ఐటి నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి.
దీని వెనుకే 270 ఎకరాలలో “ఏపీకి చెందిన” అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ రూ.9,500 కోట్ల పెట్టుబడితో ఓ గిగాప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్లాంట్కు కూడా మంత్రి కేటీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు. ఇక్కడ లిథియం బ్యాటరీలను తయారుచేయబోతున్నారు. ఈ కంపెనీ ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించబోతున్నాయి.
ఇంత పెద్ద పరిశ్రమ, ఐటి కారిడార్ వచ్చిందంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో హోటల్, రియల్ ఎస్టేట్, రవాణా, విద్యా, వైద్య, వాణిజ్య, వినోద రంగాలలో ఉద్యోగాలు, ఉపాది అవకాశాలు పెరుగుతాయి. కనుక ఇది “గ్రోత్ సెంటర్” అంటే “అభివృద్ధికి కేంద్రం” అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి గ్రోత్ సెంటర్స్ దాదాపు అన్ని జిల్లాలోను ఉన్నాయి. కనుకనే అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ అన్ని జిల్లాలకు కలిపి హైదరాబాద్ ఒకటే రాజధానిగా ఉంది!
ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే, విశాఖలో మాత్రమే కాస్త ఐటి కంపెనీలు, పరిశ్రమలు కనిపిస్తాయి. టిడిపి హయాంలో అటు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడలు, వాటిలో కొన్ని పరిశ్రమలు కనిపిస్తుంటాయి. కానీ ఏపీలో మరెక్కడా తెలంగాణ స్థాయిలో ఐటి హబ్లు, పార్కులు, కారిడర్లు కనిపించవు. ఒకవేళ ఉన్నా అరకొరగా కనిపిస్తాయి తప్ప ఎక్కడా ఇటువంటి గ్రోత్ సెంటర్లు కనిపించవు.
ఏపీ మళ్ళీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హైదరాబాద్కి ఐటి రంగాన్ని తెచ్చిన చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవడంతో విశాఖ ఐటి కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అందరూ చాలా ఆశలు పెట్టుకొన్నారు. ఆ దిశలో గట్టి ప్రయత్నాలే చేశారు కూడా. కానీ ముందుగా రాజధాని, పోలవరం నిర్మాణ పనులు, పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించుకొంటూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గాడిన పెట్టుకోవడం వంటి అతి ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత కధ… వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న కధలన్నీ అందరికీ తెలిసినవే.
కనుక తెలంగాణ అభివృద్ధిని చూసి సంతోషించడం తప్ప ఏపీ అభివృద్ధి గురించి ఆలోచించి బాధపడటం అనవసరం. కనుక ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఓర్పుగా ఆంధ్రా ప్రజలు ఎదురుచూడక తప్పదు.
Ministers @KTRBRS and @VSrinivasGoud inaugurated IT Tower in Mahbubnagar.
Minister KTR also inaugurated the @taskts centre and facilitation centers of @WEHubHyderabad @THubHyd located in the tower. #TrailblazerTelangana pic.twitter.com/DdeHAsBHiL
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 6, 2023



