దూకుడు పెంచడం అంటే దిగజారి మాట్లాడం కాదుగా..!

brs-ktr

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాబోతుంది, అతి త్వరలోనే కేసీఆర్ బిఆర్ఎస్ ను కాంగ్రెస్ లేదా, బీజేపీ లో విలీనం చెయ్యబోతున్నారు అంటూ కథనాలు ప్రచారం కావడంతో తన ఉనికి వినిపించడానికి బిఆర్ఎస్ నేతలు దూకుడు పెంచుతున్నారా అనేలా కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలతో రెచ్చిపోతున్నారు.

ADVERTISEMENT

నిన్న రేవంత్ పాపానికి నేను ప్రక్షాళన చేస్తున్నాను అంటూ హరీష్ మొదలు పెడితే, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరో సంచలనం గా మారాయి. రేవంత్ రెడ్డి నీ భాషలో నీకే చెపుతున్నా నీకు దమ్ముంటే, నువ్వు మగాడివైతే ఊళ్ళల్లోకి సెక్యూరిటీ లేకుండా రా, మేము కూడా వస్తాం, అక్కడ చూసుకుందాం.

మీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నట్టుగా రాష్ట్రంలో ఎక్కడా కూడా రుణమాఫీ పూర్తి కాలేదు. ఎక్కడైనా కాంగ్రెస్ నేతలు ఊళ్ళల్లోకి వస్తే తన్ని తరిమెయ్యడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ తప్పు పరిపాలించే ‘సత్తా లేని సన్నాసి’ రేవంత్ రెడ్డి ది అంటూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని మీడియా సాక్షిగా దిగజారి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో కేటీఆర్ సమాధానం చెప్పాలి.

ఇటువంటి హీనమైన భాష రాజకీయాలలో వాడితే దాని తాలూకా ఫలితాలు ఎలా ఉంటాయో వైసీపీ పార్టీని చూస్తే యిట్టె అర్ధమవుతుంది. కేటీఆర్ లాంటి చదువుకున్న వ్యక్తి కూడా, రాజకీయాలలో ఉన్నత స్థానంలో పని చేసినప్పటికీ కూడా ఇలా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని సన్నాసి అంటూ విలువలు మరిచి దిగజారుడు విమర్శలు చెయ్యడం ఆయన స్థాయిని తగ్గిస్తుంది అని గ్రహించాలి.

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లడానికి కేటీఆర్ ఎంచుకున్న ఈ విధానం ఎట్టి పరిస్థితులలోను సానుకూల ఫలితాలను ఇవ్వదనేది వాస్తవం. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన స్థాయిని తగ్గించేలా ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు చెయ్యకూడదు.

రాజకీయాలలో హుందాతనం ఉండాలి కానీ కించపరిచే గుణం ఉండకూడదు. ఓటమి నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణులను ఉత్తేజ పరచాడనికి, వారిలో నైతిక బలం పెంచడానికి ఇటువంటి వ్యాఖ్యలతో తానూ తగ్గాల్సిన అవసరం లేదు. ప్రజా వ్యతిరేక నిర్ణయాల పై ప్రభుత్వాన్ని నిలదీయడం తప్పు కాదు కానీ వ్యక్తిగతంగా ఒక వాయ్కటిని టార్గెట్ చేస్తూ దూషణలు చెయ్యకూడదు.

ADVERTISEMENT
Latest Stories