టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ నారా లోకేష్ చేసిన ట్వీట్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించడం విశేషం.
“చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేష్ ట్వీట్ నాకు చాలా బాధ కలిగించింది. ఓ కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై నారా లోకేష్ ఆందోళన ఎలా ఉంటుందో నాకు తెలుసు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో నేనూ ఇలాగే నా తండ్రి ఆరోగ్యం గురించి తీవ్ర ఆందోళన చెందాను,” అని అన్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్టుని ఇంతవరకు కేసీఆర్, కేటీఆర్ ఖండించలేదు. కనీసం స్పందించలేదు. ఆయన అరెస్టుని నిరసిస్తూ హైదరాబాద్లో ఐటి ఉద్యోగులు హైటెక్ సిటీ వద్ద ఆందోళన చేస్తే, “ఏపీలో రాజకీయ పంచాయితీలను ఏపీలోనే తేల్చుకోండి. వాటి కోసం హైదరాబాద్ శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తామంటే కుదరదు,” అని కేటీఆర్ నిష్కర్షగా చెప్పారు.
కానీ హైదరాబాద్తో సహా తెలంగాణలో పలు జిల్లాలలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లున్నారనే సంగతి ఇప్పుడు గుర్తుకు వచ్చిన్నట్లుంది. అందుకే నారా లోకేష్ బాధ అర్దం చేసుకోగలనని కేటీఆర్ మొసలి కన్నీళ్ళు కారుస్తున్నట్లున్నారు. ఆయన బాధను అర్దం చేసుకొంటే, ఆనాడు నారా లోకేష్ స్వయంగా ఫోన్ చేసినప్పుడే సంఘీభావం తెలపవచ్చు కదా? కానీ అప్పుడు నారా లోకేష్కి ‘నో’ చెప్పానని గొప్పగా చెప్పుకొని, ఇప్పుడు బాధపడుతున్నాని ఓదార్పు మాటాలెందుకు? చంద్రబాబు నాయుడు విషయంలో తమ వైఖరి ఈసారి ఎన్నికలలో తమకు నష్టం కలిగించవచ్చని కేటీఆర్ గ్రహించిన్నట్లే ఉన్నారు. అందుకే ఈ నష్ట నివారణ చర్యగా సానుభూతి మాటలు పలుకుతున్నారనుకోవచ్చు.
కానీ సిఎం కేసీఆర్తో సహా తెలంగాణ మంత్రులకు చంద్రబాబు నాయుడుపై ఎటువంటి అభిప్రాయం ఉందో అక్కడి ఆంద్రా ఓటర్లకు కూడా తెలుసు. కనుక అవసరాన్ని బట్టి బిఆర్ఎస్ నేతలు మాట మార్చుతుంటే అర్దం చేసుకోలేని రాజకీయ ఆజ్ఞానులు కారు ఆంధ్రా ఓటర్లు.



