ఇండియాలోనే అతిపెద్ద ‘కన్వెన్షన్ సెంటర్’ను నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అబుదాబికి చెందిన ఎన్ఎంసీ హెల్త్ కేర్, యూఏఈ ఎక్స్ఛేంజ్ గ్రూప్ కలిసి ఈ కన్వెన్షన్ సెంటర్ ను అతి కొద్ది కాలంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు ముందుకు వచ్చాయి. ఈ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎన్ఆర్ఐ బీఆర్ శెట్టి ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన సందర్భంగా చెప్పారు.
నిర్మాణానికి అనువైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే కనుక ఈ ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ మెగా ప్రాజెక్ట్ అంచనా వ్యయం 12,000 కోట్లు అని, ఈ కన్వెన్షన్ సెంటర్ ను 10,000 మంది కూర్చునేందుకు వీలుగా నిర్మించాలని భావిస్తున్నారు. దీంతో పాటు ఒక ఎగ్జిబిషన్ సెంటర్, ఒక ఫైవ్ స్టార్ హోటల్, అమ్యూజ్ మెంట్ పార్క్ ను కూడా నిర్మించేందుకు బీఆర్ శెట్టి ముందుకు వచ్చారు.
అంతే కాకుండా గ్రూప్ హౌస్ లు, మెగా ఆసుపత్రుల్లో కూడా శెట్టి గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరచిందని సంబంధిత వర్గాల సమాచారం. అమరావతికి ఒక ప్రచారకర్తగా ఉంటానని, అబుదాబి నుండి మరిన్ని పెట్టుబడులు అమరావతికి తరలివచ్చేలా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా బీఆర్ శెట్టి వ్యాఖ్యానించారు. గతంలో ఈ కన్వెన్షన్ సెంటర్ ను ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇదే ప్రాంతంలో స్థలాన్ని కేటాయిస్తుందో లేక తాజా పరిణామాల నేపధ్యంలో మరొక ప్రాంతాన్ని ఎంపిక చేస్తుందో చూడాలి.



