సోషల్ మీడియాలో హద్దూ పద్దూ లేకుండా సిఎం చంద్రబాబు నాయుడుపై, మంత్రులు, ప్రభుత్వంపై కామెంట్స్ చేయడం, అందుకు పోలీసులు కేసులు నమోదు చేస్తే ‘ప్రశ్నించే గొంతుల అణచివేత’ లేదా ‘రాజకీయ వేధింపులు’గా అభివర్ణించడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు విషయంలో ఇదే జరుగుతోంది. అయన పదేపదే ఇదే మాట చెపుతున్నారు.
ఈ జాబితాలో ఇంకా అనేక మంది వైసీపీ నేతలున్నారు. వారిలో లేళ్ళ అప్పిరెడ్డి కూడా ఒకరు. ఆయనపై గుంటూరు జిల్లాలో ఒక కేసు, కర్నూలులో రెండు కేసులు నమోదయ్యాయి. ఇవిగాక ఓ క్రిమినల్ కేసు కూడా ఉంది.
వీటిని సాకుగా చూపుతూ పోలీసులు తన సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేశారంటూ అయన సుప్రీంకోర్టుకువెళ్ళారు. కానీ అక్కడ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.
మీ రాజకీయాలకు న్యాయస్థానాలను వేదికగా అనుమతించలేమంటూ అయన పిటిషన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనిపై హైకోర్టుని ఆశ్రయించవచ్చని చెప్పింది.
మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో పెద్ద కుంభకోణం జరిగిపోయిందంటూ సుప్రీంకోర్టుకు వెళ్తే, ఆయనకు అక్కడ ఇటువంటి పరాభవమే ఎదురైంది.
మార్గదర్శి కేసులు ఉండవల్లికి, మద్యం రవాణా కుంభకోణం కేసులో కారుమూరి నాగేశ్వర రావుకు, ఆయన కుమారుడు సునీల్.. ఇంకా పలు కేసులలో పలువురు వైసీపీ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అందరికీ మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. అయినా ఎవరి తీరు మారలేదు. తప్పు చేస్తున్నామని ఎవరూ అనుకోవడం లేదు కనుక వారిలో పశ్చాతాపం కూడా కనిపించదు. ఏది ఏమైనప్పటికీ, వైసీపీ నేతల ఇలాంటి ప్రవర్తనే కూటమి ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని భావించవచ్చు.





