వైసీపీ రాజకీయ విమర్శలు ఎప్పటికప్పుడు టార్గెట్ ను మార్చుకుంటూ ‘ఉసరవల్లి’ మాదిరి ముందుకెళ్తున్నాయి. అంబటి రాంబాబు వివాదం లో సీఎం చంద్రబాబు టార్గెట్ గా రాజకీయం చేసిన వైసీపీ కొన్నాళ్లపాటు బాబు కేంద్రంగానే పార్టీ విమర్శలు కొనసాగించింది.
బాబు కాపు నేతలను అరెస్టులు చేసి కాపు సామాజికవర్గం మీద పగ సాధిస్తున్నారని, బాబు కాపు ద్రోహి అంటూ, రంగ మొదలుకుని ముద్రగడ వరకు ఉన్న వివాదాలన్నిటిని బాబుకి ముడిపెడుతూ బాబు పై విరుచుకుపడ్డారు. ఇక ఆ ఘట్టాన్ని ముగించి మొన్న సాయికృష్ణ వివాదాన్ని తెరమీదకు తెచ్చారు.
అయితే సాయికృష్ణ లాకప్ డెత్ కు అసలు సంబంధం లేని ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సాయికృష్ణ వివాదం లోకి బలవంతంగా లాగిమరీ రాష్ట్రంలో పవన్ టార్గెట్ గా కుల రాజకీయం మొదలుపెట్టింది వైసీపీ.
లాకప్ డెత్ లో ఒక కాపు యువకుడు అన్యాయంగా చనిపోతే అదే కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటూ పవన్ కేంద్రంగా రాజకీయ విమర్శలతో రచ్చ లేపింది. ఇక చివరికి ఆ వివాదం తో తనకేం సంబంధం అంటూ పవన్ ప్రశ్నించే స్థాయికి వైసీపీ పవన్ ను పొలిటికల్ గా టార్గెట్ చేసింది.
ఇక ఇప్పుడు ఆ అధ్యాయాన్ని కూడా ముగించుకుని నారా లోకేష్ టార్గెట్ గా రాజకీయం మొదలుపెట్టింది. డీఎస్సీ లో అక్రమాలు, అర్హత లేని వారికీ నియామకాలు, లోకేష్ ఉద్యోగాలను అమ్ముకున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మొదలుకుని వైసీపీ నేతల వరకు అందరు లోకేష్ కేంద్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
అందుకు వారు లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి అనే డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహాదీక్షలు, నిరసన ర్యాలీలు చేపట్టారు. అయితే అటు ప్రభుత్వం నుంచి ఇటు విద్యాశాఖ మంత్రి లోకేష్ నుంచి వైసీపీ అనుమానాలకు, ఆరోపణలకు జవాబులు చెప్పినప్పటికీ వైసీపీ తగ్గేదెలా అన్నట్టుగా నారా లోకేష్ టార్గెట్ గా రాజకీయ విమ్మర్శలను కొనసాగిస్తూనే వస్తుంది.
ఇలా వైసీపీ ఎప్పటికప్పుడు బాబు, పవన్, లోకేష్ చుట్టూ విమర్శలు చేస్తూ ఊసరవెల్లి మాదిరి తన పొలిటికల్ టార్గెట్ ను మార్చుకుంటూ ముందుకెళుతోంది. మరి ఇప్పుడు నారా లోకేష్ రాజీనామా డిమాండ్ తో మొదలుపెట్టిన ఈ రాజకీయం ఎప్పటికి ముగిస్తుందో.? ఇక ఆ తరువాత టార్గెట్ గా ఏ అంశంతో ఎవరిని తెరమీదకు తెస్తుందో చూడాలి…!





