ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఈరోజు వారి స్వగ్రామం నారావారి పల్లెలో జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు దంపతులు వారి కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలబడి అన్ని కార్యక్రమాలు జరిపిస్తుంటే, తండ్రి మరణంతో కుమిలిపోతున్న నారా రోహిత్, గిరీష్లకి నారా లోకేష్ ధైర్యం చెప్పారు. చిన్నాన్న పాడి మోసి అంత్యక్రియలలో పాల్గొన్నారు. సాధారణంగా ఏ కుటుంబంలోనైనా ఇలాగే జరుగుతుంది కదా? బంధుమిత్రులు పాల్గొంటారు కదా? అని అనుకోవచ్చు.
కానీ నారా రామ్మూర్తి నాయుడుతో, ఆయన కుటుంబంతో చంద్రబాబు నాయుడుకి సత్సంబంధాలు లేవంటూ ఇది వరకు వైసీపి దుష్ప్రచారం చేసింది. నారా రామ్మూర్తి నాయుడు 1994-1999 వరకు చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో అన్న చంద్రబాబు నాయుడు సలహా మేరకు రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దానికే వైసీపి వక్రభాష్యం చెపుతూ దుష్ప్రచారం చేసింది.
కానీ వారిద్దరి మద్య, వారి పిల్లల మద్య బలమైన అనుబందం, సత్సంబంధాలు ఉన్నాయనే విషయం నారావారి పల్లెలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. నేడు రామ్మూర్తి నాయుడు చనిపోయినప్పుడు అది మరింత స్పష్టంగా కనబడింది.
నారా కుటుంబంలో, నందమూరి కుటుంబంలో జరగరానిదేదో జరిగిపోతోందన్నట్లు దుష్ప్రచారం చేయిస్తూ వారి మద్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తే, బాబాయ్ వివేకా హత్య కేసులో జగనే అందరి ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది.
ఆస్తుల పంపకాల విషయంలో విజయమ్మ, షర్మిల, జగన్ ముగ్గురు మద్య జరిగిన రచ్చతో కుటుంబం పరువు పోయింది. దీనిని ‘దేవుడి స్క్రిప్ట్’ అనుకోవాలా లేదా కర్మఫలం అనుకోవాలా?
జగన్ జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో వైసీపి తప్ప చింతించినవారు లేరు. అదే చంద్రబాబు నాయుడుని జగన్ జైల్లో పెట్టిస్తే, రాజకీయాలకు దూరంగా ఉండే ఆయన సతీమణి భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, పొరుగు రాష్ట్రంలో, ఇతర దేశాలలో ఐటి ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఆయనకు సంఘీభావం తెలిపారు.
మనిషికి బలమైన కుటుంబం, బంధాలు, విలువలు, విశ్వసనీయత ఉన్నప్పుడే బయటవారు కూడా గౌరవిస్తారు. అవన్నీ చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఉన్నాయి. మరి జగన్ కుటుంబంలో ఉన్నాయా?
జగన్ జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ, షర్మిల ఇద్దరూ జగన్ని వెనకేసుకు వస్తూ పార్టీని కాపాడుకున్నారు. అందుకు ప్రతిగా జగన్ వారిద్దరినీ బయటకు గెంటేశారు. ఆస్తులలో వాటా అడిగితే వారిపై సొంత పార్టీ నేతలు, సొంత మీడియా చేతే బురద జల్లిస్తున్నారు కదా?




