తమ కొడుకు కాదని చెప్పేందుకు ధనుష్ మనసు అంగీకరించడం లేదని, ఒకవేళ ధనుష్ ఆ మాటను బహిరంగంగా చెబితే తమ పోరాటాన్ని నిలిపివేస్తామని ధనుష్ తమ కొడుకంటూ పోరాడుతున్న కదిరేశన్, మీనాక్షి దంపతులు తెలిపారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడతూ… తమ చేతులతో గోరుముద్దలు తినిపించిన తాము ఈ వయసులో డబ్బుల కోసం దేహీ అంటూ ప్రాధేయపడబోమని తేల్చి చెప్పారు. ధనుష్ కు చిన్నప్పుడు ఇడ్లీలో నూనె కలిపిన కారంపొడి నంజుకుని తినడం ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.
‘‘నేను మీ కొడుకును కాదు. నన్నెందుకు బజారుకీడుస్తున్నారు?’’ అని ధనుష్ ఇప్పటి వరకు ప్రశ్నించలేదని, అలా అడిగేందుకు ఆయన మనసు ఒప్పుకోకపోవడమే కారణమని కదిరేశన్ దంపతులు కీలక వ్యాఖ్యలు చేసారు. తమకు ధనభాగ్యం, కలైసెల్వన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఇప్పుడు ధనుష్ గా ప్రపంచానికి తెలిసినవాడు తమ చిన్న కొడుకు కలైసెల్వన్ అని తెలిపారు. మదురైలోని ఓ పెద్దాస్పత్రిలో పుట్టిన కలైసెల్వన్ తన పుట్టింట్లో పెరిగి పెద్దవాడయ్యాడని మీనాక్షి తెలిపారు.
మేలూరు ప్రభుత్వ స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నాడని పేర్కొన్నారు. తిరుపత్తూరు స్కూల్ లో ప్లస్ వన్లో చేరిన పది రోజుల తర్వాత అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడని, ఏళ్ల తరబడి అతడి కోసం వెతికామని, ఆవేదన వ్యక్తం చేసారు. ఓ రోజు ధనుష్ నటించిన ‘పొల్లాదవన్’ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూను టీవీలో చూసిన తర్వాత అతడు తమ కుమారుడిలానే ఉన్నాడని అందరికీ చెప్పి సంతోష పడ్డామని, ఆ ఇంటర్వ్యూలో ధనుష్ సైతం తనది మధురై అని, ప్లస్ వన్ తర్వాత అర్ధంతరంగా చదువు మానేసినట్టు చెప్పాడని గుర్తుచేశారు.
ధనుష్ మా కొడుకేనని చెబుతుంటే అందరూ ఎగతాళి చేస్తున్నారని, అందుకే మరో మార్గం లేక కోర్టును ఆశ్రయించామని అన్నారు. ‘‘మా నెత్తురు పంచుకు పుట్టిన బిడ్డ మేమెవరిమో తెలియనట్టు ప్రవర్తిస్తుండడాన్ని భరించలేకపోతున్నాం, డీఎన్ఏ పరీక్ష చేయిస్తే నిజాలు బయటకు వస్తాయని” కదిరేశన్ దంపతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ దంపతులు చెప్పినట్లు… ‘వీళ్ళు నా తల్లితండ్రులు కాదని ధనుష్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు?’ అన్నది కాస్త లాజిక్ గానే ఉంది.



