బంగ్లాదేశ్, మయన్మార్ తో పాటు ఇండియాలోని ఉత్తర భారతానికి పెను ముప్పు పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ ముప్పు రేపే రావచ్చు లేదా మరో 500 ఏళ్ల లోపు రావచ్చు. ఎప్పుడు వస్తుందో చెప్పలేదు గానీ, ఎలా వస్తుందో మాత్రం స్పష్టంగా వివరించారు. అయితే ఇదేదో సాధారణ ఉప్పెన కాదు, ఇది సంభవిస్తే… మూడు దేశాలు అతలాకుతలమైపోతాయని, దీని తీవ్రతకు ఈ మూడు ప్రాంతాలు శవాల దిబ్బగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇంతకీ ఈ ముప్పు ఎలా సంభవిస్తుందంటే… భూమి పొరల్లోని ఇండో టెక్టోనిక్ ప్లేట్లపై గత 13 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్న పరిశోధకులు తమ పరిశోధన ఫలితాలను ‘నేచర్ జియో సైన్స్’ అనే జర్నల్ లో ప్రచురించారు. బంగ్లాదేశ్, మయన్మార్, ఉత్తర భారత్ గుండా వెళ్లే ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ను ‘ఇండో బర్మీస్ ఆర్క్’ అని పిలుస్తారు. ఈ ప్లేట్ 62,159 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీనిని ఆనుకుని మయన్మార్ లోని ‘సుండా ప్లేట్’ ఉంది. ఈ రెండు ప్లేట్ల మధ్య వ్యత్యాసం ప్రతి ఏటా పెరుగుతోంది. ఏడాదికి 46 మిల్లీ మీటర్ల దూరం పెరగడాన్ని పరిశోధకులు జీపీఎస్ వ్యవస్థ ద్వారా 13 ఏళ్లుగా చేస్తున్న ఉపగ్రహ ఛాయా చిత్ర అధ్యయనం ద్వారా గుర్తించినట్టు చెప్పారు.
ఈ గ్యాప్ ప్రతి ఏటా అంతకంతకూ పెరుగుతుండడంతో భూకంపం రావడం ఖాయమని వారు స్పష్టం చేశారు. పైగా, ఈ భూకంపం 8.2 నుంచి 9 తీవ్రతతో సంభవిస్తుందని, అలాంటి భూకంపం వస్తే భూకంప కేంద్రం నుంచి 99 చదరపు కిలోమీటర్ల దూరం అతలాకుతలమవుతుందని తెలుపారు. దాదాపు 14 కోట్ల మంది ప్రజలు దీని బారిన పడి ఛిన్నాభిన్నమవుతారని, భారత్ లోని 107 పట్టణాలపై ఈ ప్రభావం పడుతుందని, గంగ, బ్రహ్మపుత్రా నదులు కూడా ఈ భూకంపానికి ప్రభావితం కావడంతో బురద ఊర్లపై పడి పెను ప్రమాదం తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.



