ఈ నెల 9న కేరళ, అసోం, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు జరిగాయి కానీ వాటిపై పెద్దగా ఉత్కంఠ లేదు. నేడు జరుగుతున్న పశ్చిమ బెంగాల్ (మొదటి దశ), తమిళనాడు శాసనసభ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు రాష్ట్రాలలో ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని బిజేపి సర్వశక్తులు ఒడ్డిపోరాడుతుండటమే ఇందుకు కారణమని భావించవచ్చు.
అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో బిజేపి అధికారంలో ఉంది. అటువంటి మరో రాష్ట్రం బిహార్ని కూడా మెల్లగా చేజిక్కించుకుంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 నియోజకవర్గాలున్నాయి. కనుక ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాగలిగితే ఇక బిజేపికి తిరుగు ఉండదు.
కానీ అవతల ఉన్నది మామూలు వ్యక్తి కాదు. బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ. 34 ఏళ్ళపాటు ఏకధాటిగా రాష్ట్రాన్ని పాలించిన వామపక్ష పార్టీని 2011లో గద్దె దించి అప్పటి నుంచి అంటే 15 ఏళ్ళుగా సిఎం కుర్చీలో సెటిల్ అయిపోయారు.
ఈ 15 ఏళ్ళలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి చాలా బలోపేతం చేసుకుని తిరుగులేని అధికారం చలాయిస్తున్నారు. అలాంటి శక్తివంతురాలైన ఆమెను గద్దె దించి పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా కాషాయ జండా ఎగరేయాలని బిజేపి చేయని ప్రయత్నం లేదు.
కనుక మళ్ళీ మరోసారి ఆమె అధికారం చేజిక్కించుకుంటే, మరో 5 ఏళ్ళ వరకు ఆ రాష్ట్రంలో బిజేపికి అవకాశం రాదు. కనుక ఈ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చేందుకు బిజేపి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. ఆమె కూడా బిజేపిని చాలా ధీటుగా ఎదుర్కొంటున్నారు. కనుక ఈ ఎన్నికలు ఆమెకు, మోడీకి చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి.
ఒకవేళ ఈసారి కూడా ఆమె గెలిస్తే అది 2029 సార్వత్రిక ఎన్నికలలో బిజేపికి ప్రమాద ఘంటికలుగానే భావించవచ్చు. ఎందుకంటే, గత సార్వత్రిక ఎన్నికలలోనే బిజేపి అంచనాలు అందుకోలేక ఎన్డీయే మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడవలసి వచ్చింది.
ఈసారి కూడా బెంగాల్లో మమత, తమిళనాడు స్టాలిన్ గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే వారు, కాంగ్రెస్ పార్టీ కలిసి బిజేపిని దెబ్బ తీసేందుకు గట్టి ప్రయత్నం చేస్తారు. అప్పుడు దేశంలో కాంగ్రెస్ మిత్రపక్షాలతో పాటు బిజేపిని వ్యతిరేకించే శక్తులన్నీ ఏకమయ్యే అవకాశం ఉంటుంది.
కానీ పశ్చిమ బెంగాల్లో బిజేపి కాషాయ జండా ఎగరేసి, మమత వంటి బలమైన నాయకురాలు బలహీనపడితే ఇక దానికి తిరుగుండదు.
ఈ నెల 29న బెంగాల్లో రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. మే 4న ఫలితాలు వెలువడుతాయి.




