ఓ నలుగురికి సంబంధించిన కధలతో ఇప్పటికే ‘ఓం శాంతి, గమ్యం’ చిత్రాలు తెలుగులో విడుదలై, బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రం ప్రభావమే చూపాయి. తాజాగా అదే బాటలో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో “మనమంతా” సినిమా రాబోతోందని తాజాగా విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ స్పష్టం చేస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఇతర కీలక పాత్రల్లో గౌతమి, విశ్వాంత్, అనీషా అంబ్రోస్ తదితరులు నటిస్తున్నారు.
మోహన్ లాల్ స్వయంగా డబ్బింగ్ చెప్తుండడంతో తెలుగు పదాలు కాస్త కొత్తగా వినపడుతున్నాయి. అయితే ట్రైలర్ వరకు ఓకె అనిపించుకున్న స్వరం, ఆగష్టు 5వ తేదీన విడుదల కానున్న సినిమా ఆద్యంతం ఎలా ఉంటుందో చూడాలి. అయితే మోహన్ లాల్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా, మధ్య తరగతి జనాలకు కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. కధ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేకపోయినా… మానవ సంబంధాల భావోద్వేగాలను ఎంతగా వెండితెరపై పండించగలిగారు అనే దానిపైన సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
అయితే దర్శకుడిగా చంద్రశేఖర్ యేలేటికి ఉన్న విలక్షణత ఈ ‘మనమంతా’ సినిమాకు దోహదం చేయవచ్చు. ‘ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం’ వంటి విలక్షణమైన సినిమాలను తెరకెక్కించి, దర్శకుడిగా తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. ఒక సినిమా కధకు, మరో సినిమా కధకు సంబంధం లేకుండా సాగుతున్న చంద్రశేఖర్ యేలేటి ప్రయాణంలో ఈ ‘మనమంతా’ సినిమా మరో మలుపు తిప్పుతుందని ఆశిద్దాం.



