సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఒక్కో ఉదంతంలో ఒక్కో కారణం ఉండొచ్చు, అలాగే ఓవరాల్ గా ఎవరి అభిప్రాయం వారికుండొచ్చు. కానీ, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ విషయంలో మాత్రం బాలీవుడ్ సినీ పరిశ్రమే దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఈ దిశగా మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
అమ్మాయిల పట్ల జరుగుతున్న ఈవ్ టీజింగ్ కు బాలీవుడ్ బాధ్యత వహించాలని, మహిళలపై పెరుగుతున్న దాడులకు సినిమాలే కారణమని మండిపడ్డారు. దాదాపు అన్ని సినిమాల్లో ఈవ్ టీజింగ్ తోనే ప్రేమ మొదలవుతోందని… ప్రాంతీయ భాషా చిత్రాల్లో కూడా ఇదే ఒరవడి కొనసాగుతోందని సినీ కధలపై విమర్శల వర్షం కురిపించారు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం, తాకడం, వేధించడం, ఆ తర్వాత ప్రేమలో పడటం… అన్ని సినిమాల తీరు ఇలాగే ఉంటోందని ఎద్దేవా చేసారు.
ఈ పరిణామాలతో మహిళలపై వేధింపులకు, హింసకు పాల్పడవచ్చనే భావన పురుషుల్లో పెరుగుతోందని, చేతకాని పురుషులే మహిళలపై హింసకు పాల్పడుతారని, పనిలో వైఫల్యం చెందే పురుషులే మహిళలపై అసహనాన్ని ప్రదర్శిస్తారని అన్నారు. అయితే మేనకాగాంధీ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ కూడా విమర్శలు గుప్పిస్తోంది. సినీ పరిశ్రమ శక్తిని తక్కువగా చూడవద్దని, ఈ పరిశ్రమపై విమర్శలు గుప్పించడం ఫ్యాషన్ గా మారిందని నిర్మాత అశోక్ పండిట్ మండిపడ్డారు.



