‘ఏపీ రాజధాని అమరావతి’ అని పార్లమెంటు ఆమోదముద్ర వేస్తున్నప్పుడు వైసీపీ అధినేత జగన్ హటాత్తుగా ‘మావిగన్’ అంటూ మరో కొత్త రాజధాని ప్రతిపాదించారు.
తమిళ సినిమా తమిళ టైటిల్తో తెలుగులో రిలీజ్ చేసినట్లున్న ఆ పేరు చూసి జనం ఒకటే ఇకఇకలు.. పకపకలు!
మరో పక్క పార్లమెంటు సభ్యులు కూడా దానిని ఎద్దేవా చేస్తుంటే, వైసీపీలు మాత్రం కలికట్టుగా ఓ వారం రోజుల పాటు మావిగన్తో హోరెత్తించేశారు.
కానీ హటాత్తుగా ఆ పాట ఆపేశారు. బహుశః జనం నవ్వుతున్నారని గ్రహించడం వల్లనో లేదా మళ్ళీ మాట మార్చి మడమ తిప్పి మావిగన్ అంటే మొదటికే మోసం వస్తుందనో కావచ్చు.
వైసీపీ ఏ కారణంతో మావిగన్ పాట ఆపేసినప్పటికీ దాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. జగన్ ఉద్దేశ్యం మావిగన్ రాజధాని కానే కాదు. ఆ పేరుతో సిఎం చంద్రబాబు నాయుడుపై బురద జల్లడమే.
అయన అమరావతి పేరుతో దోచేసుకుంటున్నారని, అమరావతి కోసం రాష్ట్రాన్ని దివాళా తీయించేస్తున్నారని ప్రచారం చేస్తూ ప్రజలలో ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టడం దీని అసలు ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
నాడు మూడు రాజధానుల పేరుతో ఇలాగే ప్రయత్నించారు. ఈసారి అమరావతి పేరుతో ప్రయత్నిస్తున్నారు. అంతే తేడా!
అమెరికా-ఇరాన్ యుద్ధం వలన దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత నెలకొని ఉందనే విషయం అందరికీ తెలుసు. కానీ అమరావతిలో కాంట్రాక్టర్లకు సరఫరా చేస్తుండటం వలననే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందంటూ వైసీపీ శ్రేణులు రోడ్లపై ధర్నాలు చేస్తుండటం గమనిస్తే, వారు అమరావతిని ఎంతగా ద్వేషిస్తున్నారో అర్ధమవుతుంది.
అమరావతి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వారు ధర్నాలు చేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడుతూనే, అమరావతి వద్దంటున్న తమపై రాష్ట్రాభివృద్ధిని వ్యతిరేకిస్తున్న పార్టీగా ముద్ర పడకుండా తప్పించుకునేందుకు కూడా ఈ అతితెలివి ప్రదర్శిస్తున్నారని భావించవచ్చు.
తమ ఈ అతి తెలివితేటలను ప్రజలు అర్థం చేసుకోలేరని వైసీపీ భావిస్తున్నట్లు కూడా అనుకోలేము. రాజకీయ అహంభావంతోనే ప్రజల విజ్ఞతని తక్కువగా అంచనా వేస్తోంది. కనుక వైసీపీకిసమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలదే.




