ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు కాస్త చల్లబడగా, ‘మావిగన్’తో ఏపీలో రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. అయితే ‘మావిగన్’ ప్రతిపాదనతో నవ్వులపాలవుతున్న జగన్ పరువు కాపాడేందుకు, వైసీపీ శ్రేణులు తమ బద్ధ శత్రువైన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ సాయం తీసుకోవడం మరీ విడ్డూరంగా ఉంది.
మావిగన్ ప్రతిపాదన చేసిన జగన్, ఆయనకు తాన తందానా పాడుతున్న వైసీపీ శ్రేణులను ఎద్దేవా చేస్తూ వేమూరి అన్న ఒకమాట వారికిప్పుడు ఎంతగానో ఉపయోగపడుతోంది.
వైసీపీ నేతలందరూ మంగళవారం హైదరాబాద్ వెళ్ళి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట వైసీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు.
తద్వారా ‘మావిగన్’తో నవ్వులపాలైన తమ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు కష్టపడుతున్నారని వేమూరి రాధాకృష్ణ ఆక్షేపించారు.
మొన్న వైసీపీలో అందరూ ‘మావిగన్ రాజధాని-దాని ప్రయోజనాలు’, ‘అమరావతి-దానిలో జరిగే అవినీతి’ గురించి అనర్గళంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు అందరూ వేమూరి రాధాకృష్ణ గురించి మాట్లాడుతుండటం డైవర్షన్ పాలిటిక్స్ అని అర్ధమవుతూనే ఉంది.
కానీ వేమూరి పేరు చెప్పుకొని వైసీపీ ఎన్ని రోజులు ఈ డ్రామా కొనసాగించగలదు? అంటే సమాధానం దొరకదు. కానీ ఆలోగా ‘మావిగన్’ని మరిపించే మరో కొత్త అంశం వెతికి పట్టుకునేందుకు తాడేపల్లి ప్యాలస్కి తగినంత సమయం లభిస్తుంది.
కనుక అలనాడు హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడుతో సమానంగా శ్రీహరి నామస్మరణ చేసినట్లు, వైసీపీ శ్రేణులు కూడా మరో రెండు మూడు రోజుల పాటు తమ బద్ధ శత్రువైన వేమూరి రాధాకృష్ణ నేతలు నామస్మరణ చేయక తప్పదు. ఈలోగా తాడేపల్లి ప్యాలస్ నుంచి కొత్త లైన్ రావచ్చు.




