ఏ రాష్ట్రం, దేశంలోనైనా ప్రతిపక్షాలు ప్రభుత్వ పనితీరుని, దానిని నడిపిస్తున్నవారి వ్యవహారశైలి గురించి విమర్శలు చేస్తూనే ఉంటాయి.
అలాగే మీడియా కూడా ప్రభుత్వ విధానాలు, తప్పొప్పులు, మంచి చెడులని విశ్లేషించి చెపుతూనే ఉంటుంది. ఇది ప్రభుత్వానికి, ప్రజలకు చాలా అవసరం కూడా. వీటితో ప్రభుత్వం తన పాలనలో, విధానాలలో లోపాలను సవరించుకోగలుగుతుంది. అలాగే ప్రభుత్వ తప్పొపులను ప్రజలు అర్థం చేసుకొని తదనుగుణంగా స్పందించగలుగుతారు.
సహేతుకమైన మీడియా విమర్శలను అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు తప్పులను సరిచేసుకునే ప్రభుత్వాలకు తిరుగే ఉండదు. కాదనుకొని విర్ర వీగినవారు తుడిచిపెట్టుకుపోతూనే ఉంటారు.
ప్రతిపక్షాలలో ఎలాగూ ప్రభుత్వ వ్యతిరేక ధోరణి ఉంటుంది కనుక చాలాసార్లు అవి తమ రాజకీయ కోణంలో నుంచే చూస్తూ తమ పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం, అధికార పార్టీపై విమర్శలు, ఆరోపణలు చేస్తుంటాయి.
ఇప్పుడు పలు రాజకీయ పార్టీలు సొంత మీడియా, సోషల్ మీడియా వారియర్స్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి. కనుక ఆవిధంగా ఏర్పాటయిన మీడియాలో నిష్పక్షపాత ధోరణి ఆశించడం చాలా కష్టం. ప్రభుత్వ వ్యతిరేక దుష్ప్రచారమే విధానంగా మారింది. కనుక సదరు పార్టీలకు మీడియా ముసుగులో ‘ఎక్స్టెన్షన్’గా పనిచేస్తున్నట్లు అర్ధమవుతోంది.
ఉదాహరణకు ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీల సొంత మీడియాలో వస్తున్న వార్తలు, కధనాలను చూస్తే అర్ధమవుతుంది.
నిజానికి అవి బయటపెడుతున్న కొన్ని విషయాలు తప్పకుండా ప్రభుత్వాలకు మేల్కొలుపు వంటివే. కానీ ఆయా పార్టీల అధినేతల ఆలోచనలకు అనుకూలంగా, పార్టీ అభిప్రాయాలను, వైఖరిని సమర్ధిస్తూ, ప్రభుత్వంపై నిరంతరం బురద జల్లడానికే సదరు మీడియా పరిమితం కావడం వలన అవి యోగ్యత కోల్పోయినట్లే భావించవచ్చు.
ప్రభుత్వాన్ని, దానిని నడిపిస్తున్న పాలకులను సదరు మీడియా ఎంతగా విమర్శించినా అర్థం చేసుకోవచ్చు. కానీ అవి ఏ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయో, ఆ పార్టీయే గాడి తప్పుతున్నప్పుడు, అధినేత ఆలోచనలు, ధోరణి ప్రమాదకరంగా మారినప్పుడు కూడా అప్రమత్తం చేయకపోవడం, ఆ తప్పులను సమర్ధిస్తూ వెనకేసుకువస్తుండటం వెన్నుపోటు పొడుస్తున్నట్లే భావించాల్సి ఉంటుంది.
సొంత మీడియాతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం రాజకీయాలలో సహజమే కావచ్చు. కానీ సొంత మీడియాతో భజనలు చేయించుకుంటూ, మనం నడుస్తున్న మార్గమే సరైనదని నేరుగా వెళ్ళి గోతిలో పడతామంటే ఎవరిది తప్పు?




