కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఆ లేఖ రాసింది ఎవరు?… ముద్రగడే రాశారా?… లేక జగన్ రాశారా? ఒక ముఖ్యమంత్రికి రాసే లేఖేనా ఇది..? అంటూ స్వయంగా చంద్రబాబే ఆశ్చర్యం వ్యక్తపరిచేలా లేఖలోని భాష చర్చనీయాంశమైంది. ఇలాంటి భాష జగన్ ఒక్కరి సొంతమే, బహుశా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్టేట్ చేస్తే ముద్రగడ రాసినట్లుగా ఉందని మంత్రి నారాయణ అభిప్రాయపడ్డారంటే, ఈ లేఖలోని ఆంతర్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఓ పక్కన కాపులకు ఇటీవలే రుణాలు పంపిణీ చేసి సరైన రీతిలో న్యాయం చేస్తున్నా, ఇలాంటి ఆరోపణలు రావడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు, కాపు సామాజిక వర్గానికి చెందిన కేబినెట్ మంత్రులు ముద్రగడపై పోరు సాగించాలని, ఎదురు దాడికి దిగాలని సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రభావం మంత్రి నారాయణ ప్రెస్ మీట్ లో స్పష్టంగా బయట పడింది.
“రెండు రోజుల క్రితం ఏలూరులో కాపు కార్పొరేషన్ ద్వారా 192 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయగా, మిగిలిన అన్ని జిల్లాల్లోను ఇచ్చేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇంతలోనే తొందరపడితే ఎలా? ‘ఈ దరిద్రపు జాతి పూర్తిగా అంతరించిపోవాలన్నదే మీ కోరికగా కన్పిస్తున్నది’ అంటూ లేఖలో రాసిన కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని.., కాపులంటే దరిద్రపు జాతా? కాపుల్లో పేద ప్రజలే కానీ దరిద్రులు మాత్రం కాదు. ఎంత కాలం నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు? పదాలు రాసేటప్పుడు జాగ్రత్తగా వహించావద్దా? మీరు కాపు వర్గానికి చెందిన వారు, నేనూ కాపు వర్గానికి చెందిన వాడినే. ఈ రాష్ట్రంలో కాపులకు ఎవరు ఎటువంటి మేలు చేస్తారో చూద్దాం” అంటూ మంత్రి నారాయణ తీవ్రంగా స్పందించారు.
కాపు ఉద్యమం లేవనెత్తిన సమయం నుండి ముద్రగడపై వేచి చూసే ధోరణితో ఉన్న చంద్రబాబు సర్కార్, ఇక ఎదురుదాడే లక్ష్యంగా దూసుకెళ్ళనుందని మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది. అయితే ఈ లేఖ వెనుక జగన్ ఉన్నాడనే మాటలు సర్వత్రా వినపడుతున్నాయి. కుల రాజకీయాలను ఉపేక్షించవద్దని చంద్రబాబు తన అనుచర వర్గానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన దరిమిలా రాష్ట్రంలో హాట్ హాట్ వాతావరణం నెలకొంది.



