ఎప్పుడు ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రత్యర్థులను కించపరుస్తూ వార్తలలో ఉండే ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా మళ్ళీ తన నోటికి పని చెప్పారు. ఏపీలో రాబోయే ఎన్నికలలో మళ్ళీ జగన్ సీఎం కావడం పవన్, బాబులు మెంటల్ ఆసుపత్రికి వెళ్లడం ఖాయం అంటూ జగన్ పై తనకున్న స్వామి భక్తిని మరోసారి చాటుకున్నారు.
ప్రత్యర్థి పార్టీల నేతలను, కార్యకర్తలను తన మాటలతో, చేష్టలతో రెచ్చగొట్టి తిరిగి వారి మీదే కేసులు పెట్టి తన అధికార జులుం ని చూపిస్తారు అంటూ ప్రతిపక్షాలు రోజా పై విమర్శలు చేస్తుంటారు. వారి విమర్శలకు తగ్గట్టే రోజా గారి ప్రవర్తన కూడా ఉండడం ఇక్కడ గమనార్హం. గతంలో అదే టీడీపీ పార్టీలో పని చేసి ఇదే చంద్రబాబుని కీర్తించిన రోజా ఇప్పుడు కనీసం ఆయన వయస్సుకి, అనుభవానికి కూడా విలువ ఇవ్వకుండా చేస్తున్న విమర్శలు టీడీపీ శ్రేణులలో ఆవేశాన్ని నింపుతున్నాయి.
అలాగే తోటి కళాకారుడిగా అయినా కనీస మర్యాద ఇవ్వకుండా పవన్ ను వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను విమర్శలు చేసి అటు జనసైనికుల ఆగ్రహానికి కారణమవుతారు మంత్రి రోజా.తాజాగా తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రికి పోటీగా ప్రజాదరణ పొందిన సీతక్కను చూసి రోజా రాజకీయాలలో ఎలా నడుచుకోవాలో తెలుసుకోవాలని టీడీపీ – జనసేన క్యాడర్ సలహా ఇస్తున్నారు.
ఒక నక్సలైట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న మహిళ ఎవరిని కించపరచకుండా, ఎవరి మీద నోరు పారేయకుండా రాజకీయాలలో అంచెలంచెలుగా ఎలా ఎదిగారో చూసి అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని అయినా రోజాలో మార్పు రావాలని టీడీపీ తమ్ముళ్లు కోరుకుంటున్నారు. ప్రత్యర్థులను దూషిస్తేనో, స్వామి భక్తి చాటుకుంటేనో ప్రజలలో ఆధారం పెరగదు. అలా చేయడం వలన వచ్చేది ఐదేండ్లకే మాయమైపోతుంది. ఇన్నాళ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క వివాదంలోను ఇరుక్కోలేదు సీతక్క.
చివరికి తమ ప్రత్యర్థి పార్టీల నుండి కూడా ప్రశంసలనే పొందింది కానీ ఎన్నడూ తన గౌరవాన్ని తగ్గించుకునే విమర్శలు చేయలేదు సీతక్క. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన టీడీపీ ని చంద్రబాబుని కాదని కాంగ్రెస్ లో చేరిన ఎన్నడూ టీడీపీ మీద కాని బాబు మీద కానీ విమర్శలు సైతం చేయలేదు.అలా అని పార్టీ అధినేతలను మెప్పించడానికి వారి భజనా కార్యక్రమాలలో కూడా పాలు పంచుకోలేదు.
నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వానికి తగిన సూచనలు చేసి ప్రజల మన్ననలు పొంది ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా తన బాధ్యతలు నెరవేర్చడానికి సిద్ధమయ్యారు సీతక్క. “సీతక్క అనే నేను…”అనగానే తాను పడిన కష్టానికి ప్రజల నుండి ఎదురైనా గుర్తింపు ఏపాటిదో పార్టీ అధిష్టానం నుండి రాష్ట్ర గవర్నర్ మొదలుకొని తెలుగు ప్రజలందరూ వీక్షించారు. అక్కడే అర్ధమయ్యింది “ప్రజలలో ఫేమ్ కావాలంటే ఉండాల్సింది నోరు కాదు మంచి పేరు” అని రోజాకి సలహా ఇస్తున్నారు టీడీపీ – జనసేన నేతలు.




