వరుణ్ తేజ్ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడంటే, దానికి ‘కంచె’ సినిమా ద్వారా దక్కిన పేరు ప్రఖ్యాతలే కారణమని చెప్పాలి. కమర్షియల్ గా ఈ సినిమా ఎంత స్థాయి కొట్టిందనేది ప్రామాణికం కాలేదు గానీ, ఈ సినిమా చేసిన చిత్ర యూనిట్ సభ్యులందరికీ మంచి కీర్తిప్రతిష్టతలను మాత్రం మిగిల్చింది. దీంతో వరుణ్ కాంభినేషన్ తో వెనువెంటనే “రాయభారి” సినిమా ఉంటుందని క్రిష్ స్వయంగా ప్రకటించాడు. కానీ, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఎంట్రీ ఇవ్వడంతో, ఇది వెనక్కి జరిగింది. దీంతో ఈ సినిమా ఇక అటకెక్కినట్లేనన్న టాక్ హల్చల్ చేసింది.
దీనికి మరింత బలాన్నిచ్చే విధంగా, ఇటీవల క్రిష్ తో విక్టరీ వెంకటేష్ మరియు ఇతర హీరోల కాంభినేషన్స్ వినిపించాయి గానీ, వరుణ్ పేరు తెరపైకి రాలేదు. ప్రస్తుతం అయితే క్రిష్ ఓ బాలీవుడ్ సినిమా ప్లానింగ్ లో ఉండడంతో, తెలుగు హీరోల పేర్లు వెనక్కి వెళ్ళాయి. అయితే ‘మిస్టర్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఉన్న వరుణ్ తేజ్, ‘రాయభారి’ సినిమాపై స్పష్టత ఇచ్చారు. ‘కంచె’ తర్వాత క్రిష్ తో ‘రాయభారి’ సినిమా చేయాల్సి ఉందని, అయితే తనకు, క్రిష్ కు ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ‘రాయభారి’ సినిమా తప్పకుండా చేస్తామని ఈ ‘మిస్టర్’ క్లారిటీ ఇచ్చారు.
వరుణ్ తేజ్ తాజా ప్రకటనతో ఈ మెగా హీరోతో క్రిష్ మరో సినిమా చేయనున్నారని స్పష్టమైంది. ఇక, శేఖర్ కమ్ములతో చేస్తున్న ‘ఫిదా’ సినిమా 75 శాతం షూటింగ్ పూర్తయ్యిందని, మరో 25 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని, మంచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని, ఈ క్లాసీ లవ్ స్టోరీని విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు వరుణ్. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న ‘మిస్టర్’ సినిమా బాగా వచ్చిందని, తన కెరీర్ లో ఓ మెమరబుల్ సినిమాగా నిలుస్తుందని, సింపుల్ గా చెప్పాలంటే తన వయసుకు తగ్గట్లు ‘ఎంటర్టైన్మెంట్ తో కూడిన ప్రేమకధా చిత్రమని’ చెప్పుకొచ్చారు.



