తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పేరుతో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. త్వరలో హైదరాబాద్ నగర ప్రజలందరికీ ఎంఎంటిఎస్ రైళ్ళలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతోంది.
తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు ద.మ.రైల్వే జనరల్ మేనేజర్, కమర్షియల్ మేనేజర్ తదితర ఉన్నతాధికారులతో దీని గురించి చర్చించారు. వారి సూచన మేరకు లిఖిత పూర్వకంగా ప్రతిపాదన పంపారు.
ప్రస్తుతం ఎంఎంటిఎస్ సర్వీసుల ద్వారా ద.మ.రైల్వేకి ఏడాదికి రూ.10 కోట్లు ఆదాయం లభిస్తోంది. దానిని తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ఉచిత ప్రయాణంతో పెరిగే ప్రయాణికులని ద.మ.రైల్వే మినహాయించాలి. ఈ ప్రతిపాదనని రైల్వే బోర్డు ఆమోదిస్తే జూన్ 2న తెలంగాణ అవరతరణ దినోత్సవం రోజు నుంచి నగర ప్రజలు ఎంఎంటిఎస్ రైళ్ళలో ఉచితంగా ప్రయాణించవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం అకస్మాత్తుగా ఇలాంటి ప్రతిపాదన ఎందుకు చేసింది?అంటే నగరంలో కొత్తగా ఎన్ని రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మించినప్పటికీ ట్రాఫిక్ రద్దీ పెరుగుతూనే ఉంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. కనుక ప్రజా రవాణాని వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించడం కోసమని చెపుతోంది.
కానీ వాస్తవం ఏమిటంటే త్వరలో అత్యంత కీలకమైన జిహెచ్ఎంసి ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.
ఈ లెక్కన ప్రభుత్వం చేతికి రాబోతున్న హైదరాబాద్ మెట్రోలో కూడా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ మెట్రోకి కూడా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం విస్తరిస్తే, ఆ తర్వాత డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాలలో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఎంత బాగుంటుందో కదా?




