కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ప్రజలందరూ వివిద పండుగలు జరుపుకుంటున్నప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటో అర్దమవుతుంది.
పండుగలు మాత్రమే కాదు.. నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా కులమతాలు, భాషలు, ప్రాంతాలు, సంస్కృతీ సంప్రదాయాలకు అతీతంగా యావత్ దేశ ప్రజలు యోగాసనాలు వేస్తూ మరోసారి భిన్నత్వంలో ఏకత్వం చాటి చెప్పారు.
ఇంతకంటే ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 100కు పైగా దేశాలలో ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు.
ఓ పక్క ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలు పరస్పరం క్షిపణుల వర్షం కురిపించుకుంటూ వినాశనం సృష్టించుకుంటుంటే, యావత్ ప్రపంచదేశాలను భారత్ యోగతో ఏకం చేస్తూ, అందరికీ ఆరోగ్యం కలిగిస్తూ విశ్వశాంతికి దోహదపడింది.
ప్రధాని మోడీ యోగని కనిపెట్టలేదు. కానీ ఆయన చొరవ తీసుకొని ఐక్యరాజ్యసమితిని ఒప్పించి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవం జరిపేలా చేశారు. ప్రధాని మోడీ కృషి వల్లనే నేడు యావత్ ప్రపంచ దేశాలలో యోగాభ్యాసం మొదలైందని చెప్పక తప్పదు.
ఇదేవిదంగా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. కనుక ఆయన చొరవ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహింపజేశారు.
ఈరోజు విశాఖ బీచ్ రోడ్లో జరిగిన ఈ కార్యక్రమంలో సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “ప్రధాని మోడీ ఏదైనా సంకల్పిస్తే దానిని తప్పకుండా పూర్తిచేస్తారు. నేడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అందరూ యోగ చేస్తుందటమే ఇందుకు చక్కటి నిదర్శనం.
ప్రధాని మోడీ యోగాతో పాటు నాచురోపతి, ఆయుర్వేద, గ్రీన్ ఎనర్జీ, స్వచ్చ భారత్, వికసిత్ భారత్, సేంద్రీయ వ్యవసాయం వంటివాటిని కూడా చాలా ప్రోత్సాహిస్తున్నారు.
యోగా అంటే కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు. యావత్ ప్రపంచదేశాలను ఒక్కటి చేసే ఓ గొప్ప ఆలోచన. వన్ వరల్డ్ వన్ హెల్త్,” అంటూ ప్రధాని మోడీ ఆలోచనలు సామాన్య ప్రజలకు సైతం అర్దమయ్యేలా వివరించారు.




