పెద్ద నోట్లను రద్దు చేసి దాదాపుగా 24 రోజులు గడుస్తోంది. అయినా పరిస్థితి ఇప్పటివరకు అదుపులోకి రాలేదు. ప్రజల్లో ఆగ్రహం, అసహనం కట్టలు తెంచుకుంటోంది. అమరావతిలో అయితే బ్యాంకు అధికారులతో జనాలు వాగ్వివాదానికి దిగడంతో ఏకంగా పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. తమ డబ్బులు తమకు కావాలని ప్రజలు కోరుతుంటే… రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తమకు కరెన్సీ కట్టలను పంపించలేదని బ్యాంకు అధికారులు తమ గోడును వెలిబుచ్చుకుంటున్నారు.
సాధారణంగా రోజులు గడుస్తున్న కొద్దీ ఇబ్బందులు తొలగిపోతూ ఉంటే ప్రజలు కూడా వాటిని సమర్ధిస్తారు. కానీ, ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే… రోజులు గడుస్తున్న కొలదీ ప్రజలకు మరిన్ని ఇబ్బందులు తలెత్తుతుండడం. దీంతో కరెన్సీ రద్దు విషయంలో తొలుత ప్రధానిని సమర్ధించిన వారు కూడా విమర్శల పర్వం మొదలుపెట్టారు. ఆర్ధిక నిపుణులు సైతం… ప్రణాళికబద్ధత లేకుండా నోట్ల రద్దును అమలు చేసారని, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పనితీరుపై, ప్రధానిపై విమర్శలు చేస్తున్నారు.
ఈ కరెన్సీ కష్టాలు చాలవన్నట్లుగా తాజాగా బంగారంపై వెలుగులోకి తీసుకువచ్చిన విషయాలు సామాన్య ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎంత పేద ఇంట్లో అయినా ఎంతో కొంత బంగారం ఉండడం సహజమే. అయితే మహిళకు ఇంత అని, పురుషులకు ఇంత అని లెక్కపెట్టుకుని ఎవరూ కొనుగోలు చేయరు. కానీ, ‘ఎప్పటినుండో ఉన్న నిబంధనలనే మేం చెప్తున్నాం’ అంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది.
లెక్క చూపని బంగారంపై ఏకంగా 75 శాతం ఉంటుందని కేంద్రమంత్రి వర్యులు వెంకయ్య నాయుడు స్పష్టం చేసారు. అయితే ఈ “లెక్క”లలోనే చాలా బొక్కలు ఉన్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారసత్వంగా వస్తున్న బంగారంపై పన్ను ఉండదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఏది వారసత్వమో, ఏది కొత్తగా కొనుగోలు చేసిందో ఎలా తెలుసుకుంటారు? బంగారానికి బిల్లులు తీసుకోవాలన్న నిబంధన గానీ, తీసుకున్న బిల్లులను దాచుకోవాలన్న ఆలోచన గానీ ఎప్పుడూ సామాన్య ప్రజానీకం చేసింది లేదు. మరి ఈ రోజు కొత్తగా ఇవన్నీ కావాలంటే ఎలా? అంటూ మోడీ సర్కార్ పై మండిపడుతున్నారు.
కరెన్సీ విషయంలో మోడీ ఫెయిల్ అయ్యారు కాబట్టే, గోల్డ్ విషయాన్ని వెలుగులోకి తెచ్చారన్న విమర్శలకు ప్రాధాన్యత చేకూరుతోంది. ఈ విమర్శలను పక్కనపెడితే, బంగారం విషయంలో మోడీ విసురుతున్న కొరడా కూడా సామాన్యుడికే తగులుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే… గాలి జనార్ధన్ రెడ్డి వంటి వారి ఇంటి నిండా బంగారమే అన్న విషయం గతంలో మీడియాల వేదికగా బయటపడిన విషయం తెలిసిందే. ముందుగా అలాంటి వ్యక్తుల పనిపట్టి, సామాన్యుడి దగ్గరి వస్తే అప్పుడు వారు కూడా సమ్మతిస్తారన్న అభిప్రాయం విశ్లేషకుల నుండి వ్యక్తమవుతోంది.



