ప్రధాని మోడీ ‘మన్ కీ భాత్’ వినమంటే ఎవరూ వినరు కానీ జాతినుద్దేశ్యించి ప్రసంగిస్తారంటే అందరూ టక్కున టీవీల ముందు కూర్చుంటారు.
కారణం తెలిసిందే… ఒకసారి జాతినుద్దేశ్యించి ప్రసంగిస్తే ‘పెద్దనోట్లు రద్దు’ చేసి షాక్ ఇచ్చారు. మరోసారి ‘లాక్ డవున్’ ప్రకటించారు. మరోసారి ఆపరేషన్ సింధూర్’ అన్నారు.
కనుక ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ జాతినుద్దేశ్యించి ప్రసంగిస్తే ఏం బాంబులు పేలుస్తారో?అనే భయం దేశాప్రజలలో ఉంటుంది.
ప్రస్తుతం ట్రంప్ సుంకాల మోత, హెచ్-1బీ వీసా ఛార్జీల పెంపు హాట్ టాపిక్స్! వాటిలో సుంకాలకు జీఎస్టీ మందు వేశారు. కానీ ఆ డోస్ ఏమాత్రం సరిపోదు. అది తాత్కాలిక ఉపశమనమే అవుతుంది.
త్వరలో బీహార్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక జీఎస్టీ మందు సకలరోగ నివారిణి అన్నట్లు కేంద్ర ప్రభుత్వం, బీజేపి గట్టిగా చెపుతున్నాయి. కనుక ప్రధాని మోడీ ప్రసంగంలో అదే ముక్క మరోసారి గట్టిగా చెప్పే అవకాశం ఉంది.
ట్రంప్ సుంకాలతో ఇప్పటికే భారతీయ ఐటి కంపెనీలు, పరిశ్రమలు అల్లాడుతున్నాయి. ఆ మహానుభావుడు ఇప్పుడు ఇక హెచ్-1బీ వీసా ఫీజు పెంచేశాడు. కనుక ఈ దెబ్బను తట్టుకోవడం ఐటి కంపెనీలకు చాలా కష్టమే.
ఈ సుంకాలు, వీసాల కారణంగా భారీగా ఉద్యోగాల కోతలు మొదలయ్యే ప్రమాదం పొంచి ఉంది. కానీ దీనికి జీఎస్టీ మందు పనిచేయదు. కనుక ‘కరోనా వాక్సిన్’ వంటి వేరేదైనా బలమైన మందు వేయాల్సి ఉంటుంది.
ప్రధాని మోడీ ఈరోజు ప్రసంగంలో ఆ మందుల పేర్లు చెపితే అందరూ సంతోషిస్తారు. కానీ తేలు కాటుకి, పాము కాటుకీ ఒకటే మంత్రం అన్నట్లు దీనికీ జీఎస్టీ వాడుకోవచ్చని చెపితేనే ఇబ్బంది. భారత్లో పెరుగబోయే ఈ నిరుద్యోగ సమస్యకు ప్రధాని మోడీ సరైన పరిష్కారం చూపిస్తారనే ఆశిద్దాం.





