వైసీపి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే పార్టీలో నేతలు, కార్యకర్తలు అధినేత జగన్ చెప్పిన్నట్లే నడుచుకోవాలని ఆశించడం చాలా సహజం. కానీ రాష్ట్రంలో అన్ని పార్టీలు తాము చెప్పిన్నట్లే నడుచుకోవాలనుకోవడం విడ్డూరం.
ఏపీలో టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకోవడం అపరాధం. అనైతికం. అందుకు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేస్తుంటారు. అవి మాత్రం సహేతుకమేనట!
ఏపీ బీజేపీకి దగ్గుబాటి పురందేశ్వరిని అధ్యక్షురాలుగా నియమించడం సరికాదట! చంద్రబాబు నాయుడుకి ఆమె బంధువు అవటమే ఆమె నేరమట! కనుక ఆమె ఓ జాతీయపార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు, మహిళ అని కూడా చూడకుండా నోటికి వచ్చిన్నట్లు అవహేళన చేయడాన్ని వైసీపి తప్పుగా భావించడం లేదు.
ఇప్పుడు ఎంపీ విజయ సాయిరెడ్డి దృష్టి తెలంగాణ రాజకీయాలపై పడింది. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో టిడిపి పోటీ చేయకపోవడాన్ని ఆయన తప్పు పడుతూ “అనుకుల మీడియా పెద్దలు, సొంత సామాజిక వర్గ హితులు, ఇతర పార్టీల్లోని స్లీపర్ సెల్స్ ప్రయోజనాల కోసమే తెలంగాణాలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. దీన్ని ‘జెండా పీకేయడం’ అని ఎందుకు అనకూడదో బాకా మీడియా క్లారిటీ ఇవ్వాలి. ఏపీలో కూడా మిత్ర పక్షాలకు సీట్లు ఇవ్వాలి కాబట్టి టీడీపి 100 స్థానాల్లో కూడా పోటీ చేసే పరిస్థితి లేదు,” అని ట్వీట్ చేశారు.
అంటే పొరుగు రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీ ఎన్నికలలో పోటీ చేయకపోవడం తప్పు అని ఆయన నిర్ధారించేశారన్న మాట. ఒకవేళ పోటీ చేస్తే అది కూడా తప్పే అంటూ మరో రకంగా వితండవాదం చేయకుండా ఉంటారా? అంటే అనుమానమే.
ఏపీలో వైసీపి రెండో ఛాన్స్ కోసం ఎన్ని ఎత్తులు, జిత్తులు ప్రదర్శిస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. అందుకోసం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీ ముఖ్య నేతలందరిపై రకరకాల కేసులు నమోదు చేస్తూ జైల్లోనే ఉంచి అడ్డు లేకుండా చేసుకొని, ఎన్నికలకు వెళ్ళాలని దురాలోచన చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నా వైసీపి పట్టించుకోవడం లేదు. అంటే వైసీపి చేస్తే సంసారం అదే టిడిపి, జనసేనలు చేస్తే వ్యభిచారం అని భావిస్తోందనుకోవాలి.
ఇతర పార్టీలు ఏవిదంగా నడుచుకోవాలో సుద్దులు చెపుతున్న వైసీపికి ప్రతిపక్షాలు, మీడియా చెపుతున్న మంచి మాటలు ఏనాడైనా చెవికి ఎక్కించుకొందా? అంటే అదీ లేదు.
“నాపై రాజకీయకక్షతో అమరావతిని పాడుపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ని నాశనం చేయవద్దని,” చంద్రబాబు నాయుడు ఆనాడు ఎంతగా వేడుకొన్నా పట్టించుకొందా?లేదు కదా? మూడు రాజధానులంటూ 5 ఏళ్ళు కాలక్షేపం చేసేసి చివరికి ఒక్క రాజధాని కూడా లేకుండా చేసింది కదా?
అందుకే ఏపీ నుంచి తరలిపోతున్న పరిశ్రమలను తెలంగాణకు తెచ్చుకొంటున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెపుతున్నారు. కానీ అందుకు బాధపడని విజయ సాయిరెడ్డి, తెలంగాణలో టిడిపి జెండా పీకేసిందని, ఏపీలో 100 స్థానాలలో కూడా పోటీ చేయలేదని సంతోషపడుతుండటం పైశాచిక ఆనందమే కదా?




