వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ బారిన పడ్డారంటూ ఆయన కుమార్తె జనసేన నేత క్రాంతి తన సోషల్ మీడియా వేదికగా విషయాన్ని బహిర్గతం చేసారు. అయితే తన తండ్రికి క్యాన్సర్ వచ్చినా తన అన్న గిరి ముద్రగడకు సరైన వైద్యం అందించడంలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్రాంతి.
ముద్రగడ ఆరోగ్యం విషయంలో గిరి చాల గోప్యత పాటిస్తున్నారని, తనతో సహా తమ కుటుంబసభ్యులెవ్వరికి ఈ విషయం గురించి వెల్లడించలేదంటూ చెప్పుకొచ్చిన క్రాంతి తన అన్న గిరి, అతని మామ కలిసి ముద్రగడ చుట్టూ ఒక వలయాన్ని సృష్టించి ఆయనను కలిసేందుకు వీలు లేకుండా చేస్తున్నారంటూ గిరి అతని మామ మీద ఆరోపణలు చేసారు క్రాంతి.
అయితే గత ఎన్నికల సమయంలో ముద్రగడ కుటుంబం వైసీపీ, జనసేన అనే రెండు పార్టీల మధ్య నిట్టనిలువన చీలిపోయింది. ముద్రగడ, ఆయన తనయుడు గిరి వైసీపీ జెండా మోయడానికి సిద్ధపడితే ఆయన కుమార్తె క్రాంతి, ఆమె భర్త జనసేన వైపు మొగ్గుచూపారు. దీనితో ముద్రగడ కుటుంబంలో మొదలైన ఆ రాజకీయ చిచ్చు ఇప్పుడు వ్యక్తిగత విబేధాలుగా మారి తండ్రి కూతుర్ల కలయికను సైతం అడ్డుకునే స్థాయికి చేరుకున్నాయి.
వైసీపీ గెలుపు కోసం తన పేరును సైతం మార్చుకోవడానికి సిద్ధపడ్డ ముద్రగడ ఆరోగ్య పరిస్థితి పై వైసీపీ నేతలకు కూడా ఆయన కుమారుడు గిరి సమాచారం అందించలేదా.? క్రాంతి ఈ విషయం గురించి వెల్లడించేంతవరకు ముద్రగడ ఆరోగ్య పరిస్థితి పై ఎటువంటి సమాచారం లీక్ కాలేదు. అయితే క్రాంతి ఆరోపణలలో వాస్తవాలేమిటో, గిరి గోప్యత వెనుక ఆంతర్యం ఏమిటో తెలియాల్సి ఉంది.




