ఒకప్పుడు కాపు ఉద్యమ నాయకుడిగా రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి గుర్తింపు ఉన్న ముద్రగడ పద్మనాభం తన స్వయంకృతాపరాధాలతో ఆ సామాజికవర్గానికి పూర్తిగా దూరమయ్యారు, తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం తన గౌరవాన్ని పోగొట్టుకున్నారు.
గత ఎన్నికల సమయంలో వైసీపీ కండువా కప్పుకుని, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేను అంటూ ప్రకటించిన జగన్ కి జై కొట్టి కాపు సామాజిక వర్గం నుండి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఛీ కొట్టారు. ఆయన పై వ్యక్తిగత దూషణలు చేసారు, ఆ పార్టీ ఓటమి కోసం పంతం పట్టారు.
పిఠాపురంలో పవన్ ను ఓడించి వైసీపీ ని గెలిపించకపోతే నా పేరు ని రెడ్డిగా మార్చుకుంటా అంటూ సొంత కూతురుని కూడా కాదనుకుని వైసీపీ జెండా పట్టుకుని చివరికి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా రూపతరం చెందారు. కాపు నుంచి రెడ్డి గా మారిన ఈ క్రమంలో ముద్రగడ రాజకీయంలో నిశ్శబ్దం అలముకుంది.
అయితే తాజాగా అంబటి వ్యవహారం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన వేళ వైసీపీ కుల రాజకీయాలు తిరిగి జీవం పోసుకున్నాయి. అందులో భాగంగా బాబు నాయకత్వంలో కాపులకు రక్షణ లేదని, ఈ సామాజికవర్గాన్ని ఈ రాష్ట్రం నుంచి కట్టుబట్టలతో వేరే రాష్ట్రానికి పంపించాలంటూ ముఖ్యమంత్రి బాబు తో ముద్రగడ లేఖల రాజకీయాలను మొదలుపెట్టారు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఏడు పదుల వయసున్న ఒక పెద్దాయనను పట్టుకుని అంబటి నీచాతి నీచంగా మాట్లాడితే తప్పని ఖండించలేని నోళ్లు, వద్దని వారించలేని చేతులు ఇప్పుడొచ్చి కులం తలుపు తడితే అది కవచమవుతుందా.? అంబటి ఇంటి మీద దాడి జరిగితే అది కాపు సామాజికవర్గం మీద జరిగిన దాడిగా చిత్రీకరిస్తూ, టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో కాపు కులాన్ని రక్షణ లేదంటూ లేఖలు రాసి వైసీపీ కుల రాజకీయానికి మరోసారి అస్త్రంగా మారారు ముద్రగడ.
తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరగలేదంటు సీబీఐ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలా మీ పార్టీ నేతలను కాపు నాయకుడి ఇంటి మీదకి దాడులకు పంపుతారా.? మీకు కాపు సామాజికవర్గం అంటే ఎందుకంత కక్ష్య అండి బాబు గారు.? అంటూ గారాలు పొతే అది గౌరవం అనిపించుకుంటుందా.?
గతంలో నా కుటుంబాన్ని అవమానించారు, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చారు, ఈ సామాజికవర్గం మీకు మద్దతు ఇవ్వడం లేదనేది నా అభిప్రాయం అంటూ వైసీపీ అభిమతాన్ని ప్రజలు మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ముద్రగడ.
అయితే ముద్రగడ లేఖ వెనుక ఉన్న సారాంశం మొత్తంలో ఆయన కాపు సామాజికవర్గం గురించి, ఆ వర్గానికి ఈ రాష్ట్రంలో ఉన్న రక్షణ గురించి వివరించారు సరే, అసలు ఇంతకీ ముద్రగడ ఒక రెడ్డి గారిగా వచ్చి కాపు భద్రతా గురించి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారా.? లేక కాపు గా వచ్చి రెడ్డి గారి గళం వినిపించారా.?
అంబటి చర్యకు టీడీపీ శ్రేణులు ప్రతి చర్య చూపిస్తే అది కాపు వర్గం మీద దాడి అంటున్న వైసీపీ, పవన్ పై మీద వైసీపీ చేసిన దాడి ఏ వర్గం మీద దాడిగా సమర్ధించుకుంటారు.? పోసాని మొదలు, అంబటి, పేర్ని, ముద్రగడ, గుడివాడ అమర్నాధ్, రోజా, ద్వారం పూడి…ఇలా అనేకమంది వైసీపీ నాయకులు అదే కాపు సామాజికవర్గం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ పై విచక్షణారహితంగా రెచ్చిపోయారు.
అలాగే ఆయన కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చి నీచాతి నీచంగా, సభ్య సమాజం తలదించుకునేలా విమర్శించారు, మరి ముద్రగడ దృష్టిలో నాడు ఏపీలో కాపు సామాజికవర్గానికి రక్షణ ఉన్నట్టా.? లేనట్టా.? నాడు బూతులతో, వ్యక్తిగత దాడులతో వైసీపీ పవన్ పై విరుచుకుపడడం అంటే అది కాపు సామాజికవర్గానికి వైసీపీ ఇచ్చిన మర్యాదగా భావించాలా.? లేక ఆ వర్గానికి జగన్ ఇచ్చిన గౌరవంగా ఉహించాలా.?






