రాజకీయ పార్టీల అధికార క్రీడలో భాగంగా కొనితెచ్చిన మునుగోడు ఉప ఎన్నికలు రకరకాల మలుపులు తిరుగుతూ, ఎత్తులు పైఎత్తులతో హోరాహోరీగా జరిగి ఎట్టకేలకు ముగిసాయి. 2023 సాధారణ ఎన్నికల ముంగిట జరుగుతున్న ఈ ఉపఎన్నికలను చావో రేవో అన్నట్టుగా భావించి అధికార పార్టీ సామ, ధాన, భేద, దండోపాయాలతో ప్రయెూగించి మరీ గెల్చుకుంది. శాసనసభలో 2/3 మెజారిటీ ఉండీ, కేవలం ఒక సంవత్సరం గడువు ఉన్న సభలో, ముఖ్యమంత్రి కూడా ఒక్క స్ధానంలో జరుగుతున్న ఉపఎన్నికకు కొన్ని ప్రాంతాలకు ఇంచార్జిగా ఉన్నారంటే ఈ ఎన్నికలను అధికార పార్టీ ఎంత సీరియస్ గా తీసుకుందో ఊహించవచ్చు. దేశంలోనే ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఖరీదైన ఎన్నికలగా పరిగణించిన ఈ ఎన్నికల ఫలితాలు పడ్డ కష్టానికి, పెట్టిన ఖర్చుకు తగ్గవి కాదన్న విశ్లేషణలు వస్తున్నాయి. మెదటిసారి గెలిచిప్పుడు ఇచ్చిన హామీలే నెరవేర్చకపోవడం, ఫార్మ్ హౌస్, ప్రగతి భవన్ తప్ప బయటకు రాకపోవడం, సచివాలయానికి వెళ్లకపోవడం, ఒంటెద్దు పోకడలు, సొంత మనుషులకు అందలాలు, కుటుంబ పాలన వంటి అనేక ఆరోపణల నేపథ్యంలో అధికార బిఆర్యస్ కు రాబోయే సాధారణ ఎన్నికలు గత రెండు సార్లవలే నల్లేరుపై నడక కాదనే సంకేతాలిచ్చాయని సాదారణ ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు.
మరో తెలుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపిపై కూడా దాదాపు ఇటువంటి ఆరోపణల నేపధ్యంలో ఆ పార్టీకీ ఈ ఫలితాలు ముందస్తు ప్రమాద హెచ్చరికలుగా భావించాలి. గత ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు నుంచే వైసిపికి పూర్తి స్థాయిలో తెరవెనుక నుండి సహకారం అందించింది. ఇప్పటికీ ఆ రెండు పార్టీల అధినాయకత్వాల మద్య సంబంధాలు బలంగానే ఉన్నా, ఎన్నికలకు మరో సంవత్సరంనర్ర సమయం ఉండటం, ఆంధ్రలో ఎలాగూ అధికారం వచ్చే అవకాశాలు లేవు గనుక, కేంద్రంలో తమ పార్టీ అధికారం నిలుపుకోవడానికి అప్పటికి ప్రజల నాడిని బట్టి తమ స్టాండు మార్చుకునే అవకాశాలే ఎక్కువ.
తెలంగాణలో జరిగింది కేవలం ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఉపఎన్నిక కనుక రాష్ట్ర అధికార యంత్రాంగం అక్కడి ప్రభుత్వానికి అనుగుణంగానే నడుచుకుంది, గుర్తుల కేటాయింపు విషయంలో సిఇసి జోక్యం చేసుకుని ఒక ఆర్వోని బదిలీ చెయ్యడం అందుకు నిదర్శనం. కానీ సాధారణ ఎన్నికల సమయంలో అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం కనుసన్నలలో ఉంటారు కనుక ఇక్కడ తాము ఏరికోరి నియమించుకున్న అధికారులు తోడ్పాటు వైసిపికి స్ధానిక ఎన్నికల్లో కొమ్ముకాసిన విధంగా చెయ్యలేరు కనుక అలా ఏదైనా చేద్దామనుకునే ఆశలు పెద్దగా ఉపయెూగపడవు.
అలాగే మునుగోడులో అధికార పార్టీ ప్రత్యర్థులు అందుకోలేని రీతిలో ఖర్చు చేసినా, కమ్యూనిస్టులు మద్దతిచ్చినా చెమటోడ్చి గెలిచింది. ఇక్కడ మతపరమైన కారణాల వల్ల వైసిపి, బిజేపి ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకునే అవకాశం లేదు, తెలుగుదేశం, కమ్యూనిస్టులు, జనసేన, టిడిపి వైసిపి అక్రమాల మీద నిరంతరం పోరాడుతున్నాయి, ఏదో మాయ జరిగితే తప్ప అవికూడా పొత్తు పెట్టుకోవు, మరి కొన్ని సర్వేల్లో 50% వరకు ప్రభుత్వ వ్యతిరేక ఉందని చెబుతున్న సమయంలో మద్దతిచ్చే పక్షాలు లేకుండా ఎలా నెగ్గుకురాగలదో చూడాలి. అలాగే ఓటుకు పదివేల వరకు ఇవ్వబోతోందని ప్రతిపక్షాలు చెబుతున్నట్టుగా పంచినా డబ్బు వల్ల ఓట్లు గంపగుత్తగా వచ్చిపడివని మునుగోడు ఫలితం నిరూపించింది.
2019లో విజయానికి దోహదపడిన మరొక ముఖ్య అంశం జగన్ రెడ్డి కేంద్రం మెడలు వంచుతా, ప్రత్యేక హోదా తెస్తా, మాట తప్పను మడమ తిప్పను వంటి వీరోచిత డైలాగులు. అప్పటి వరకు జగన్ నేరుగా అధికారంలో లేకపోవడం వల్ల కూడా ప్రజలు జగన్ మాటలు నమ్మారు, కానీ గత మూడున్నరేళ్ళుగా ఆయన వంచిన మెడలు, తెంచిన తలలు, సాధించిన మెడల్స్, తిప్పని మడమలు అన్నీ చూస్తున్న ప్రజలు ఈసారి గుడ్డిగా నమ్మే అవకాశం లేదు. బిజేపితో అరవీర భయంకరంగా పోరాడుతున్న(?) బిఆర్యస్ నే జనం నమ్మలేదని మునుగోడు నిరూపించింది. మరి మరి మెూడి ఢిల్లీలో తుమ్మితే ఇక్కడ నాప్కిన్ తో రెడీ అయిపోతున్నట్టుగా ఉంటున్న వైసిపిని నమ్మే అవకాశంలేదు.
ఇలా ఏవిధంగా చూసినా మునుగోడులో బిఆర్యస్ కు ఉన్న ప్రతికూల అంశాలు దానికి రెండింతలుగా ఉన్న వైసిపికి కూడా ఆ ఫలితాలు రెండో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేసినట్టే.
శ్రీకాంత్. సి



