టిఆర్ఎస్, బిజెపిల రాజకీయ ఆధిపత్యపోరులో తమ సత్తా చాటుకొనేందుకు తెచ్చిపెట్టిన మునుగోడు ఉపఎన్నికలలో బిజెపిపై టిఆర్ఎస్ పార్టీయే పైచేయి సాధించింది. ఈ రోజు వెలువడిన ఉపఎన్నికల ఫలితాలలో టిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప బిజెపి ప్రత్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,117 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరి ఈ ఉపఎన్నికలు తెచ్చిపెట్టారు. చివరికి ఆయనే నష్టపోయారు. మునుగోడులో కోమటిరెడ్డి సోదరులకు మంచి పట్టుంది. కనుక నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓట్లన్నీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే పడతాయనే ధీమాతోనే ఆయన చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి బిజెపి ఈ ఉపఎన్నికలు తెచ్చిపెట్టుకొంది.
అప్పటికీ ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడులో తమ అనుచరులకి ఫోన్లు చేసి, బిజెపి అని చూడకుండా తన తమ్ముడికే ఓట్లు వేసి గెలిపించాలని చెప్పారు. కనుకనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 86,709 ఓట్లు పడ్డాయి. కనుక నిజానికి అవన్నీ కాంగ్రెస్ పార్టీకే పడి ఉంటే 23,934 ఓట్లు పొందిన కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఈ ఉపఎన్నికలలో విజయం సాధించి ఉండేవారు.
కనుక బిజెపి దురాశతో రాజకీయంగా తప్పటడుగు వేసి నష్టపోతే, కాంగ్రెస్ పార్టీ అంతర్గత బలహీనతలు, కుట్రలు, కుతంత్రాల వలన నష్టపోయిందని చెప్పవచ్చు.
కురుక్షేత్ర మహాసంగ్రామంలో గెలిచిన పాండవులకు ఏ సంతోషం మిగలనట్లే, కేవలం ఏడాది పదవీ కాలం మాత్రమే మిగిలి ఉన్న ఈ ఉపఎన్నికల కోసం వందల కోట్లు ఖర్చు చేసి, కేవలం 10,117 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన టిఆర్ఎస్కి’కూడా కొత్తగా ఒరిగెదేమీ ఉండదు. బిజెపిపై కేసీఆర్ ప్రతీకారం తీర్చుకొన్నారనే సంతృప్తి తప్ప! ఆ సంతృప్తి ఖరీదు కొన్ని వందల కోట్లు! అంటే ఈ ఉపఎన్నికలలో పోటీపడిన టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ మూడూ కూడా భారీ మూల్యం చెల్లించాయని చెప్పవచ్చు. అయితే ఈ ఖరీదైన ఉపఎన్నికలలో విజయం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు ల్యాండింగ్గా ఉపయోగపడవచ్చు.




