మల్టీస్టారర్ సినిమాలు అనగానే సాధారణంగా హీరోల మధ్య ఈగో సమస్యలు ఉత్పన్నమవుతాయని టాలీవుడ్ అగ్ర నటుడు ‘కింగ్’ నాగార్జున వివరించారు. ఈ హీరోకు ఎన్ని పాటలు, ఆ హీరోకు ఎన్ని పాటలు, ఫైట్లు, ఇమేజ్ అంటూ రకరకాల సమస్యలు తలెత్తుతాయని అన్నాడు. అయితే తానూ నటించిన ‘ఊపిరి’ సినిమాలో సహ నటుడు కార్తీతో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని నాగ్ అన్నారు.
నటుల్లో ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను చూడడం జరగదని కార్తీకి ఆయన కితాబిచ్చిన నాగ్, ఇక నుండి కార్తీ తన సోదరుడిగా మారిపోయాడని ప్రశంసించారు. అలాగే తనకు నచ్చిన నటుల్లో కార్తీ సోదరుడు సూర్య కూడా ఒకరని చెప్పిన నాగ్, తనను వీల్ ఛైర్లో కూర్చోబెట్టి కార్తీ, తమన్నా కలిసి డాన్సులు చేశారని చమత్కరించారు, సుదీర్ఘ కాలం తరువాత ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తూ ‘ఊపిరి’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని, ఈ సినిమా ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ‘కింగ్.’



