టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి న్యాయం కోరుతూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో ప్రజల మద్యకు వచ్చి పోరాడుతున్నారు. గురువారం ఆమె తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో పర్యటించారు. ఇదివరకు ఎన్నడూ ఆమె బహిరంగ సభలలో ప్రసంగించనప్పటికీ, ఏ మాత్రం తడబడకుండా తన మనసులో ఆవేదనను, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను, ఇంకా అనేక అంశాల గురించి చక్కగా ప్రసంగిస్తున్నారు.
భువనేశ్వరి తమ కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థను విజయవంతంగా నడిపిస్తున్న సంగతి తెలిసిందే. కనుక ఓ విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా ఆమె రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరిస్థితిని చక్కగా విశ్లేషించారు.
గురువారం తిరుపతిలో ఈ కార్యక్రమం ఆమె ప్రసంగిస్తూ, “మేము దాదాపు మూడు దశాబ్ధాలుగా హెరిటేజ్ డెయిరీని నడిపిస్తున్నాము. హెరిటేజ్ డెయిరీ ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో కూడా విస్తరించి ఉంది. ఏ రాష్ట్రంలోనైనా మేము హెరిటేజ్ సంస్థ ఏర్పాటు చేయాలనుకొంటే అక్కడి ప్రభుత్వాలు మమ్మల్ని సాధారంగా ఆహ్వానిస్తాయి తప్ప ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే మా సంస్థలలో వేలాదిమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది కనుక.
కానీ మన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం మా హెరిటేజ్ సంస్థతో సహా పారిశ్రామికవేత్తలందరినీ వైసీపి నేతలు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో ఇటువంటి రాజకీయ పరిస్థితులు ఉంటే ఏ పారిశ్రామికవేత్త మాత్రం ధైర్యం చేసి పరిశ్రమలు స్థాపించడానికి వస్తాడు?
వైసీపి నేతల వేధింపులు భరించలేకనే 30 ఏళ్ళుగా మన చిత్తూరు జిల్లాలో నడుస్తున్న అమర్ రాజా కంపెనీ పొరుగు రాష్ట్రానికి తరలిపోయింది. అది అక్కడ అనేకమందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. ఈ నాలుగున్నరేళ్ళలో మన ప్రభుత్వం కొత్తగా ఓ పరిశ్రమని, ఐటి కంపెనీని తీసుకురాలేకపోయింది. కనీసం ఉన్నవాటినైనా కాపాడుకోకపోతే ఎలా?మనకు రావలసిన కంపెనీలన్నీ పొరుగు రాష్ట్రాలకు తరలిపోతుంటే, మన యువత అక్కడకు వలసలు పోయి ఉద్యోగాలు చేసుకొని బ్రతకాల్సి వస్తోంది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి?అని అడుగుతున్నాను.
ఇలా అడిగినందుకే జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుగారిపై అక్రమ కేసులు నమోదు చేసి జైల్లో వేసింది. రాష్ట్రంలో టిడిపి, జనసేన నాయకులనే కాదు… ఎవరు ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యం చేయడం, కేసులు పెట్టడం. అరెస్ట్ చేయడం. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పిస్తుండటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి.
మనం మన రాష్ట్రాన్ని ఎంతో గొప్పగా అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు నాయుడు ఎప్పుడూ పరితపించేవారు. కానీ ఈ వైసీపి పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో వెనకబడిపోయి దయనీయ స్థితికి చేరుకొంది. మన రాష్ట్రం పరిస్థితి చూస్తే నాకు చాలా బాధ కలుగుతోంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి సామరస్యాలు, అభివృద్ధి కనిపించేవి. కానీ ఇప్పుడు వాటిని మనం పోగొట్టుకొన్నాము. కనుక ఇప్పుడు మనం చేస్తున్న ఈ పోరాటాలన్నీ మన స్వాతంత్ర్యం కోసమే. మన పిల్లల భవిష్యత్ కోసమే,” అని అన్నారు.




