టిడిపి నేతలు సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ‘సైకో జగన్’ అని సంభోదిస్తుంటారు. టిడిపి యువనేత నారా లోకేష్ నిన్న సాయంత్రం రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఓ విలేఖరి ఇదే విషయం అడిగినప్పుడు నారా లోకేష్ ఏమన్నారంటే, “సైకో అనేది బూతుపదం కాదు. అది ఓ వ్యక్తి మానసిక లక్షణం గురించి తెలియజేసే పదం మాత్రమే. గత నాలుగేళ్ళుగా ఈ జగన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు సైకోలాగే ఉంది కనుకనే మేము ఆయనను సైకో జగన్ అంటున్నాము.
ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించి అరెస్ట్ చేయించడం, జైలుకి పంపించి పైశాచిక ఆనందం అనుభవించడం సైకో లక్షణాలు కావా?ఆక్రమాస్తుల కేసులో తాను 16 నెలలు చంచల్ గూడా జైల్లో ఉన్నందుకు, ప్రతిపక్ష నేతలందరినీ కూడా జైలుకి పంపించాలనుకోవడం, తనకు అవినీతి మరకలున్నాయి కనుక ఇతరులకు కూడా అవినీతి మరకలను అంటించాలనుకోవడం సైకో లక్షణాలు కావా?
రాష్ట్రానికి ఓ పరిశ్రమనో, భారీ పెట్టుబడో తెచ్చి కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకొని సంబరపడినా అర్దం ఉంటుంది. కానీ రాష్ట్రాభివృద్ధి కోసం పరితపించిన ఓ మాజీ ముఖ్యమంత్రిని జైలుకి పంపించినందుకు స్వీట్లు పంచుకొని టపాసులు కాల్చి సంబరాలు చేసుకొంటున్నవారు సైకోలే కదా?
ఆక్రమాస్తుల కేసులలో జైలుకు వెళ్ళి వచ్చినవాడు బెయిల్పై బయటకు వచ్చి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. తల్లిని, చెల్లిని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాడు. సొంత బాబాయ్ని హత్య చేసినవాడిని వెనకేసుకువస్తున్నాడు. ఇవన్నీ సైకో లక్షణాలు కావా?” అని నారా లోకేష్ ప్రశ్నించారు.
ఆక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళిన జగన్, విజయసాయి రెడ్డి, వివేకాను హత్య చేయించిన అవినాష్ రెడ్డి, కాకినాడలో దళితయువకుడిని హత్య చేసిన ఎమ్మెల్సీ ఆనంతబాబు అందరూ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కానీ రాష్ట్రాభివృద్ధి తప్ప మరో ఆలోచన చేయని చంద్రబాబు నాయుడికి అవినీతిమరక అంటించేందుకు అక్రమకేసులు బనాయించి జైలుకి పంపారు.
నాతోపాటు టిడిపి నేతలందరినీ కూడా జైలుకి పంపుతానని బెదిరిస్తున్నారు. ఇప్పటికే చాలా మందిపై ఆక్రమాకేసుల బనాయించి జైలుకి పంపించారు కూడా. అయినా మా పోరాటాన్ని ఎవరూ ఆపలేరు. ప్రజాక్షేత్రంలోనే ఈ సైకోలతో అమీతుమీ తేల్చుకొంటాము,” అని నారా లోకేష్ చెప్పారు.



