చంచల్‌గూడ జైలులో ఏ సెల్ బాగుంటుందబ్బా?

Nara Lokeshటిడిపి యువనేత నారా లోకేష్‌ ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా దారిలో మాచాపురం వద్ద పత్తి, మిరప, ఉల్లిగడ్డలు పనిదిస్తున్న రైతులతో ముఖాముఖీ సమావేశమయ్యారు. నారా లోకేష్‌ వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. వారు చెప్పిన సమస్యలన్నిటినీ సావధానంగా విన్న నారా లోకేష్‌ మరికొన్ని నెలలు ఓపికపడితే టిడిపి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు తప్పకుండా వారి సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎంతసేపు కోర్టులు, కేసుల గోలే తప్ప ఏనాడైనా మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు అడిగి తెలుసుకొన్నారా?అని నారా లోకేష్‌ రైతులను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్‌ వివేకా హత్య కేసుని ప్రస్తావిస్తూ, “ఓసారి అబ్బాయ్ జైలుకి వెళ్ళివచ్చి అక్కడ అంతా చూసుకొని వచ్చాడు. ఇటీవల బాబాయ్‌ని అదే జైలుకి పంపించాడు. త్వరలో మరొకరిని (అవినాష్ రెడ్డి)ని కూడా అక్కడికే పంపించబోతున్నాడు. ఈ మద్య ఆయన కుటుంబ సభ్యులు ఒకరు (వైఎస్ షర్మిల) కూడా చంచల్‌గూడ జైలుకి వెళ్ళి ఒకరోజు ఉండి వచ్చారు. ఏదో రోజున జగన్‌ కూడా మళ్ళీ అక్కడికే వెళ్ళవచ్చు. వ్యవసాయశాఖ మంత్రితోపాటు ఈసారి కొంతమంది మంత్రులు, ఎంపీలను, ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని వెళ్ళినా వెళ్ళవచ్చు. అసలు చంచల్‌గూడ జైలుకి వైసీపీ నేతలకి ఈ అవినాభావ సంబందం ఏమిటో అర్దం కాదు. అందరూ ఏదో ఓ సందర్భంలో చంచల్‌గూడ జైలుకి వెళ్ళి వస్తూనే ఉంటారు. మంత్రివర్గ సమావేశాలలో రాష్ట్రానికి సంబందించిన అంశాలను చర్చించుకొంటారని ప్రజలనుకొంటుంటారు. కానీ చంచల్‌గూడ జైలులో ఏ సెల్ బాగుంటుందని చర్చించుకొంటారని నేను అంటాను. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మొదలు ఎమ్మెల్యేల వరకు అందరూ రోజూ ఇదే చర్చించుకొంటుంటారు. కనుక వారికి రాష్ట్రం గురించి, ప్రజల గురించి ఆలోచించే సమయం, తీరిక, ఆసక్తి ఎలా ఉంటుంది” అంటూ నారా లోకేష్‌ సెటైర్ వేశారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories