టిడిపి యువనేత నారా లోకేష్ ఇవాళ్ళ ఒక్కరోజు యువగళం పాదయాత్రకి విరామం ఇచ్చి మంగళగిరి కోర్టులో హాజరయ్యారు. ప్రముఖ తెలుగు సినీ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి, సింగలూరు శాంతిప్రసాద్ మీద నారా లోకేష్ పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు విచారణకే నేడు కోర్టుకు హాజరయ్యారు.
తాడికొండ మండలంలోని కంతేరులో నారా లోకేష్ 14 ఎకరాలు కొనుగోలు చేశారని, దానిలో ఆయన సమీప బంధువులు కొందరు నివసిస్తున్నారని పోసాని, శాంతిప్రసాద్ ఆరోపించారు.
కనుక ఆ ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు చూపాలని లేకుంటే పరువునష్టం దావా వేస్తానని నారా లోకేష్ వారికి రెండుసార్లు లీగల్ నోటీస్ పంపించారు. కానీ వారు స్పందించలేదని చెప్పారు. నోటికి వచ్చిన్నట్లు ఆరోపణలు చేస్తుంటే వాటికి తాము సంజాయిషీ ఇచ్చుకోవలసిన అవసరంలేదని ఈవిదంగా న్యాయపోరాటం కూడా చేయవచ్చని నారా లోకేష్ అన్నారు.
అనంతరం మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ, “అయ్యా పోసానిగారు మీరే కదా నాపై ఈ ఆరోపణలు చేసింది. మరి మీకు నోటీసులు పంపిస్తే వాటిని తీసుకోకుండా ఎందుకు తప్పించుకొంటున్నారు?మీ పార్టీయే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది. కనుక కంతేరు వద్ద నాకు భూములు ఉన్నట్లయితే ఆ వివరాలను, డాక్యుమెంట్లు తీయించడం మీకేమీ కష్టం కాదు కదా? అయినా ఎందుకు వెనకాడుతున్నారు?
మీరు నేను పంపిన లీగల్ నోటీస్ తీసుకోకుండా తప్పించుకొన్నా న్యాయస్థానం మిమ్మల్ని విచారణకు రప్పించకమానదు. కనుక నాపై చేసిన ఆరోపణలు నిజమైతే వాటికి సంబందించి సాక్ష్యాధారాలన్నిటినీ సిద్దంచేసి పెట్టుకోండి. లేదా బేషరతుగా నాకు క్షమాపణ చెప్పి పరువునష్టం కలిగించినందుకు రూ.5 కోట్లు చెల్లించండి,” అని నారా లోకేష్ అన్నారు.
రాంగోపాల్ వర్మ సినిమా షూటింగ్ గురించి నారా లోకేష్ మాట్లాడుతూ, “ ఆ సినిమా షూటింగ్ కోసం రోడ్డుని మూసివేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అదే… నేను ప్రజల తరపున పోరాడుతూ యువగళం పాదయాత్ర చేసేందుకు మాత్రం అనుమతించడం లేదు. ఎందుకు? రాంగోపాల్ వర్మ సినిమా షూటింగ్ రోజంతా సాగుతుంది. కానీ నాకు ఓ 10-20 నిమిషాల సమయం ఇస్తే ముందుకు సాగిపోతాను కదా? అయినా టిడిపి, జనసేనలను అడ్డుకోవడమే పరిపాలన అని జగన్ ప్రభుత్వం అనుకొంటున్నట్లు ఉంది,” అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు.
ఏపీ సిఎం జగన్ గురించి మాట్లాడుతూ, “నాది కాలేజ్ లైఫ్… జగన్ది జైల్ లైఫ్! నాకు కాలేజీలో ఫ్రెండ్స్ ఉన్నారు. జగన్కు జైల్లో ఫ్రెండ్స్ ఉన్నారు! జగన్ తన తండ్రిని అడ్డంపెట్టుకొని లక్షలకోట్లు అవినీతికి పాల్పడి జైలుకు కూడా వెళ్ళాడు. కానీ నేను నా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా ఏనాడూ తప్పుడు పనులు చేయలేదు.
గెలిచినా ఓడినా ప్రజల మద్యే ఉన్నాను. గత ఎన్నికలలో నేను మంగళగిరిలో ఓడిపోయినా మళ్ళీ అక్కడి నుంచే ఈసారి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి శాసనసభలో అడుగుపెడతాను. నన్ను ఆక్షేపిస్తున్న వైసీపీ నేతలందరికీ దాంతోనే జవాబు ఇస్తాను,” అని నారా లోకేష్ అన్నారు.



