ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నేడు సంస్థాగత నియామకాలు జరిపింది. వీటిలోముఖ్యాంశం ఏమిటంటే, మంత్రి నారా లోకేష్ని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ప్రకటించింది. అంటే పార్టీలో, ప్రభుత్వంలో సిఎం చంద్రబాబు నాయుడు తర్వాత రెండో స్థానం నారా లోకేష్దన్న మాట! ఇది ఆ పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంకేతంగా చూడవచ్చు.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వయసు 75 సం.లు. నేటికీ ఆయన చాలా ఆరోగ్యంగా, చాలా చురుకుగా ఉన్నారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వం పనులను అత్యంత సమర్ధంగా నిర్వహిస్తున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు.
కనుక వచ్చే ఎన్నికలలో కూటమి విజయం సాధిస్తే ఆయనే మా ముఖ్యమంత్రి అని డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో సహా అందరూ ముక్త కంఠంతో చెపుతున్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వస్తేనే ప్రజలు కూడా మళ్ళీ కూటమికి అధికార పగ్గాలు అప్పగిస్తారు.
కానీ 2029 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు 79లోకి అడుగు పెడతారు. దేశ రాజకీయాలలో ఆ వయసున్న రాజకీయ నాయకులు చాలా మందే ఉన్నారు. కనుక కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు కూడా మరో 5 ఏళ్ళు అవలీలగా పాలించగలరు.
కానీ సాధారణంగా రాజకీయ నాయకులు ఆ వయసులో లేదా అంతకంటే ముందే వారసులకి పగ్గాలు అప్పగిస్తుంటారు. అదే మంచిది కూడా. సోనియా గాంధీ, కేసీఆర్ ఆ విధంగా తమ వారసులకు సకాలంలో అధికార పగ్గాలు అప్పగించకపోవడం వలన వారిరువురూ ఓ గొప్ప అవకాశం కోల్పోయారు. అంతేకాదు… వారిద్దరూ మళ్ళీ ఎన్నటికైనా అధికార పగ్గాలు చేపట్టగలరో లేదో తెలీని పరిస్థితి నెలకొంది.
కానీ అపార రాజకీయ అనుభవజ్ఞుడైన సిఎం చంద్రబాబు నాయుడు అటువంటి పొరపాటు చేస్తారనుకోలేము. కనుక వచ్చే ఎన్నికలలో కూటమిని గెలిపించుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లు, ఏడాది లేదా రెండేళ్ళలోనో నారా లోకేష్కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించి తాను పూర్తిగా పార్టీకి అంకితం కావచ్చు లేదా హుందాగా రాజకీయాల నుంచి తప్పుకొని అవసరమైనప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి మార్గదర్శనం చేయవచ్చు.
కనుక మంత్రి నారా లోకేష్కి తెలుగుదేశం పార్టీలో ఈ పదోన్నతి భవిష్యత్లో ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకే అని భావించవచ్చు.




