అజీర్తి అనేక రకాలు. వాటిలో రాజకీయ అజీర్తి కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఇందుకు ఉదాహరణగా పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులు పెట్టుకున్నప్పుడు జగన్ ఎంత అజీర్తితో బాధపడ్డారో అందరూ చూశారు.
ఆ అజీర్తి తగ్గడానికి ‘మూడు పెళ్ళాల మాత్రలు’ చాలా వేసుకున్నప్పటికీ తగ్గకపోగా ఇంకా పెరిగింది. టీడీపీతో బీజేపి కూడా పొత్తు పెట్టుకోవడమే అందుకు కారణం.
అప్పుడు జగన్ ‘అనైతిక మాత్రలు’ చాలా వాడారు. కానీ తగ్గకపోవడంతో ‘ముద్రగడ పద్మనాభం మాత్ర’ వాడారు. కానీ అది కూడా వికటించడంతో కాపు కులానికి చెందిన ఆయన తన పేరు మార్చుకొని ‘ముద్రగడ పద్మనాభ రెడ్డి’గా మారాల్సి వచ్చింది.
ఎన్నికలలో వైసీపీ ఓటమి తర్వాత జగన్ అజీర్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. అది తగ్గించుకునేందుకు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు. కానీ అక్కడా అజీర్తికి మందు దొరకలేదు.
ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ మద్య తేడా కొడుతుందని లేకుంటే నారా లోకేష్కి పవన్ కళ్యాణ్ మద్య తేడా కొడుతుందని జగన్ చాలా ఆశపడ్డారు. కానీ కొట్టకపోవడంతో అజీర్తి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది.
అదే నేడు ‘వెన్నుపోటు తేన్పులతో’ బయటపడుతోంది. వెన్నుపోటు ఫ్లెక్సీ బ్యానర్లలో కూడా పవన్ కళ్యాణ్ ఫోటోలు కనిపించడం రాజకీయ అజీర్తి వల్లనే అని భావించవచ్చు.
అయితే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇద్దరూ జగన్ రాజకీయ అజీర్తి గురించి తెలిసి ఉన్నా ఆయన బాధని ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా దారుణం!
మంత్రి నారా లోకేష్ ఈరోజు ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి యువగళం పాదయాత్ర వివరాలు, ఫోటోలతో కూడిన పుస్తకాన్ని పవన్ కళ్యాణ్కి కానుకగా ఈయగా, ఆయన ఆప్యాయంగా నారా లోకేష్ని కౌగలించుకొని పలకరించి, ఆ పుస్తకంలో చూస్తూ యువగళం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎప్పటికైనా వారిద్దరి మద్య తేడా కొట్టకపోతుందా, కొడితే కూటమి ప్రభుత్వం కూలిపోదా?పోతే చక్రం తిప్పి అధికారంలోకి రాలేకపోతామా? అని ఆశగా ఎదురుచూస్తున్న జగన్మోహన్ రెడ్డికి, వారిద్దరూ ఆప్యాయంగా కౌగలించుకొని ఫోటోలు దిగితే ఎంత అజీర్తి చేస్తుందో ఊహించడం కష్టం!
వైసీపీ సోషల్ మీడియాలో కనపడేవన్నీ జగన్ మనసులో ఆశలు, ఆలోచనలకు ప్రతిరూపాలే. కానీ సోషల్ మీడియాలో కనిపిస్తున్న పవన్, లోకేష్ ఫోటోలు మాత్రం చేదు వాస్తవాలే! పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మద్య తేడా కొట్టకపోగా ఇద్దరి మద్య స్నేహ బంధం ఇంకా బలపడుతోందని ఈ ఫోటోలే చెపుతున్నాయి.
ఇలాంటి ఫోటోలు చూస్తే ఎంత రాజకీయ అజీర్తి చేస్తుందో, దాని వలన మనసుకి ఎంత బాధ కలుగుతుందో ఎవరైనా ఊహించగలరా?




