
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను యువగళం పాదయాత్ర చేసినప్పుడు జగన్ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది.
Also Read – వైసీపీ లెక్క తప్పుతుందా.?
అప్పుడే ‘రెడ్ బుక్’ అవసరమనిపించి మొదలుపెట్టాను. దానిలో ఇప్పటికే మొదటి రెండు అధ్యాయాలు తెరిచి ఆనాడు చట్టం గీత దాటిన ప్రతీ ఒక్కరికీ చట్ట ప్రకారమే ట్రీట్మెంట్ ఇస్తున్నాము. త్వరలోనే రెడ్ బుక్లోని మూడవ అధ్యాయం కూడా తెరిచి మొదలుపెడతాము.
నేను రెడ్ బుక్ అంటే జగన్ భయపడి ‘గుడ్ బుక్’ అంటున్నారు. కానీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలని పట్టించుకోని జగన్ ఇప్పుడు అధికారం కోల్పోయాక వారిని మభ్యపెట్టేందుకు గుడ్ బుక్ అని మభ్యపెడుతున్నారు. కానీ సొంత తల్లిని, చెల్లిని మోసం చేసిన ఆయనని వైసీపిలోనే చాలామంది నమ్మడంలేదని అందరికీ తెలుసు,” అని నారా లోకేష్ అన్నారు.
Also Read – జగన్ పరామర్శ కార్యకర్త కోసం కాదట!
వైసీపికి దాని అక్రమాలు, అరాచకాలకు అండగా నిలబడిన అధికారులకు రెడ్ బుక్ ట్రీట్మెంట్ చాలా అవసరమే. లేకుంటే రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థల ప్రక్షాళన పూర్తికాదు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు రెడ్ బుక్ చూపించి జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నప్పుడు అందరూ ఆయన ధైర్యాన్ని మెచ్చుకున్నారు. కానీ నారా లోకేష్ ఇప్పుడు బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉన్నారు.
Also Read – జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కేటీఆర్ కు టెస్ట్ డ్రైవ్.?
కనుక రెడ్ బుక్ ప్రస్తావన చేస్తే తమ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు లేదా దుష్ప్రచారం చేసేందుకు వైసీపికి అవకాశం కల్పించిన్నట్లవుతుందని మరిచిపోకూడదు.
నారా లోకేష్ నోట ‘రెడ్ బుక్’ వినిపించిన ప్రతీసారి వైసీపి దానిని హైలైట్ చేస్తూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం, నారా లోకేష్ రాజ్యాంగం నడుస్తోందని, వైసీపి నేతలపై లేనిపోని కేసులు నమోదు చేయిస్తూ రాజకీయ కక్షపూరితంగా సిఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ వైసీపి దుష్ప్రచారం చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన చేయకపోవడమే టిడిపి కూటమికి మంచిది.