నారా లోకేష్ నంద్యాల నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశ్యించి చురకలు వేస్తూ, “ఈ మద్యన జగన్ జబర్దస్త్ కామెడీ చేస్తున్నారు. తాను పేదవాడినంటాడు. తాను ఒంటరివాడినని అంటాడు. బెంగళూరులో 32 ఎకరాలలో ఓ ప్యాలెస్, హైదరాబాద్లో లోటస్ పాండ్ ప్యాలెస్, తాడేపల్లి ఓ ప్యాలెస్, ఇడుపులపాయలో ఓ ప్యాలెస్, ఇప్పుడు విశాఖలో మరో ప్యాలెస్ కట్టుకొంటున్న జగన్మోహన్ రెడ్డి పేదవాడైతే, ఉండేందుకు ఇల్లు కూడా లేని పేదవారిని ఏమనాలి?
జగన్ కాలికి వేసుకొనే చెప్పుల ఖరీదే లక్ష రూపాయలు… ఆయన త్రాగే నీళ్ళ బాటిల్ ఖరీదు వెయ్యి రూపాయలు… మరి ఆయన పేదవాడు అవుతాడా?సొంత పేపర్, సొంత టీవీ ఛానల్, సొంత సిమెంట్ ఫ్యాక్టరీ, సొంత విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఉన్న జగన్మోహన్ రెడ్డి పేదవాడు అవుతాడా?ప్రజలందరూ ఆలోచించాలి,” అని అన్నారు.
‘బటన్ నొక్కుడు సభలలో’ జగన్ తాను ఒంటరిగా తోడేళ్ళ గుంపుని ఎదుర్కొంటున్నానని, తనకు ప్రజలు, దేవుడు తప్ప మరెవరూ లేరని చెప్పుకొని సానుభూతి పొందాలని ప్రయత్నిస్తుంటారు. టిడిపి భూస్వాములకు, ధనికులకు కొమ్ముకాసే పార్టీ అని కానీ తాను పేదల పక్షాన్న పోరాడుతున్నానని జగన్ ఎద్దేవా చేశారు. అందుకు తగ్గట్లుగా వైసీపీ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది.
ఇన్ని ప్యాలస్లు, ఇన్ని వ్యాపారాలు, ఇన్ని కోట్ల వ్యాపారాలు చేస్తున్న జగన్ తాను పేదల పక్షపాతినని చెప్పుకోవడాన్నే నారా లోకేష్ ఈవిదంగా ప్రశ్నించారని అర్దమవుతోంది.
టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో గురువారం మరో మైలురాయిని అధిగమించారు. జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో మొదటి అడుగు వేసిన నారా లోకేష్ 103 రోజులలో 1,300 కిమీ పాదయాత్ర పూర్తి చేశారు. నంద్యాల రూరల్ మండలంలోని కానాల పంచాయితీలో గురువారం 1,300 కిమీ పాదయాత్ర పూర్తి చేయడంతో అక్కడ షీలా ఫలకం ఆవిష్కరించారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పసుపు మార్కెట్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయిస్తానని నారా లోకేష్ స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. దానినే ఆ శిలాఫలకంపై వ్రాయించారు.



