సోషల్ మీడియా వచ్చాక చిన్నా పెద్దా, వాళ్ళూ వీళ్ళూ అనే తేడా లేకుండా ఎవరైనా పాపులర్ అవగలుగుతున్నారు. అలాగే అందరూ సోషల్ మీడియా బాధితులుగా మారుతున్నారు.
ఉదాహారణకు మంత్రి నారా లోకేష్ నిన్న తన కుమారుడు దేవాన్ష్ తో కలిసి ఉగాది పండుగ చేసుకుంటున్న ఫోటోని సోషల్ మీడియాలో పెట్టారు.
వారిరువురూ పూజగదిలో కూర్చొని పూజ చేస్తున్నప్పుడు తీసిన ఫోటో అది. పూజాపీఠంపై శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రతిమ ఉంది. కుడి వైపున ఓ ‘సాఫ్ట్ టాయ్’ ఉంది. అంతే! వెంటనే ట్రోలింగ్ మొదలెట్టేశారు.
“దేవుడి ప్రతిమ పక్కన క్షుద్ర పూజలలో కనిపించే ఆ బొమ్మ ఏమిటి? ఇంట్లో కూడా క్షుద్ర పూజలు చేస్తున్నారా?” అంటూ కొందరు రకరకాల కామెంట్స్ చేశారు.
వాటిపై మంత్రి నారా లోకేష్స్పందిస్తూ, “మా లిటిల్ ఛాంపియన్ నాలుగేళ్ళ వయసులో స్వయంగా తయారుచేసిన శివుడి బొమ్మ అది. చిన్న శివలింగం కూడా తయారు చేశాడు. ఆ తీపి జ్ఞాపకాలను ఇలా భద్రపరుచుకున్నాము. కొందరికి ఇలాంటి ఫీలింగ్స్ అర్థమవుతాయి. కొందరికి కావు. కానీ ఇలాంటి భక్తికి సంజాయిషీలు అవసరం లేదు,” అని ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్లో తమ కుమారుడు తయారుచేసిన ఆ శివుడి బొమ్మ అందరికీ స్పష్టంగా కనబడేలా పోస్ట్ చేశారు. ఆ బొమ్మ జుత్తులో ముందువైపు చంద్రవంక, నుదుటన విభూది రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ బొమ్మతో బాటు దేవాన్ష్ తయారుచేసిన చిన్న శివలింగం ఫోటోని కూడా నారా లోకేష్ పెట్టారు.
ప్రతీ ఇంట్లో పిల్లలు బొమ్మలు గీస్తుంటారు. బొమ్మలతో ఆడుకుంటారు. వాటి జుట్టు దువ్వుతారు. రకరకాల బట్టలు వేస్తారు. ఆ బొమ్మలనే తమ స్నేహితులుగా లేదా ఆత్మీయులుగా భావిస్తూ వాటితో కబుర్లు కూడా చెపుతుంటారు. ఆ బొమ్మలను అందరికీ సగర్వంగా పరిచయం చేస్తుంటారు కూడా. అలాగే దేవాన్ష్ కూడా ఈ బొమ్మలు తయారుచేశాడు.
కానీ పిల్లలు పెరిగి పెద్దవారవుతున్నప్పుడు క్రమంగా వారు ఆ బొమ్మలపై ఆసక్తి కోల్పోతుంటారు. కానీ వారి బాల్య స్మృతులను గుర్తుచేసే ప్రతీదీ తల్లితండ్రులకు అపురూపమే. కనుక వాటిని భద్రపరుస్తుంటారు. నారా లోకేష్ దంపతులు కూడా అదే చేశారు.
నారా లోకేష్ మొదట తండ్రి ఆ తర్వాతే మంత్రి. కనుక తన కుమారుడు ప్రతిభని చెప్పుకోవాలనుకుంటారు. చెప్పారు. కానీ కొందరికి ఆ ఫీలింగ్స్ అర్థమయ్యాయి. కొందరి అర్థం కాలేదు. అర్థం కానివారు నోటికి పని చెప్తున్నారు. అర్థం చేసుకున్నవారు ఇలాంటి మూర్కులకు మీరు సంజాయిషీలు ఇచ్చుకోవడం అవసరమా?అని అడుగుతున్నారు. అవును. అవసరమా?




